posted on Apr 23, 2025 4:56PM
అనీల్ కుమార్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడి, తొడకొట్టి సవాళ్లు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరెట్టుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్లుగా అప్పట్లో ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారనీ చెబుతుంటారు. సరే అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తరువాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మౌనంగా మాయమైపోయారు.
వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు. ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు.
నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్ అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని చెప్పారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ముఖం చూపలేక చాటేశారు.
విపక్షంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధకారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనీల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కొన్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తనను తాను కాపాడుకోవడం ఎలాగో తెలియక అనిల్ కుమార్ యాదవ్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో స్థాయి మరిచి.. ఇష్టారీతిగా తెలుగుదేశం, జనసేన అధినాయకులపై అనిల్ కుమార్ చేసిన అనుచిత విమర్శలు, వ్యాఖ్యల కారణంగా ఆ రెండు పార్టీలలోనూ అవకాశం లేకపోయింది. దీంతో అనివార్యంగా ఆయన ఇటు వైసీపీకి దూరమై, అటు మరో పార్టీ అండ లేకుంటే కేసులను తట్టుకోవడం సాధ్యం కాదని భావించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ జగన్ పంచన చేరి పబ్బం గడుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా నిన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడాన్ని చూపుతున్నారు. మొత్తం మీద అజ్ణానం నుంచి అజ్ణాతంలోకి అక్కడ నుంచి మళ్లీ జగన్ పంచకు చేరిన అనిల్ కుమార్ ప్రస్తతం తన భవిష్యత్ ఏమిటన్న అయోమయంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.