posted on Apr 11, 2025 11:24AM
రామగిరిలో వైసీపీ రచ్చ వెనుక కుట్ర కోణం?!
మాజీ సీఎం జగన్ భద్రత కల్పించడంతో కూటమి సర్కారు విఫలమైందని చిత్రీకరించడానికి ఆ పార్టీ నేతలు గీసిన స్కెచ్ విఫలమైంది. ఈ నెల 8న జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ఆ పార్టీ శ్రేణులు చేసిన అరాచకం వెనుక కుట్రకోణం దాగున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ప్రణాళికలో భాగంగానే హెలిప్యాడ్ వద్ద వేలమందితో వీరంగం సృష్టించి.. దాన్ని మాజీ సీఎం జగన్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. బారికేడ్లను తోసుకెళ్లడం, పోలీసులపై దాడి చేయడం, హెలికాప్టర్ వద్దకు నినాదాలు చేసుకుంటూ వెళ్లడం ముందస్తు ప్రణాళికలో భాగమేనని చెబుతున్నారు. వీటన్నింటినీ నిగ్గు తేల్చే క్రమంలో ఆరోజు హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రకాశ్రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి, పోలీసులపై దాడికి ఉసిగొల్పినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ రామగిరి రావడం పార్టీ కార్యక్రమం కావడంతో ఏర్పాట్లన్నీ స్థానిక వైసీపీ నాయకులే చూసుకున్నారు. పోలీసులు భద్రత మాత్రమే కల్పించారు. 7న కుంటిమద్ది వద్ద హెలిప్యాడ్ను పరిశీలించిన పోలీసులు.. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు అత్యంత బలహీనంగా ఉన్నాయని, వాటిని మార్చి రెండంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. వైసీపీ నాయకులు వాటిని పట్టించుకోలేదు. జగన్ హెలికాప్టర్ దిగిన వెంటనే వైసీపీ శ్రేణులు దూసుకురావడంతో బారికేడ్లు కిందపడిపోయాయి. దీనికితోడు పాపిరెడ్డిపల్లికి జగన్ కాన్వాయ్లోని 11 వాహనాలతోపాటు ముఖ్య నాయకుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామనీ, ఎలాంటి జనసమీకరణ చేయవద్దని జిల్లా ఎస్పీ రత్న ముందు రోజు ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. వైసీపీ నాయకులు అవేమీ పట్టించుకోలేదు. పైగా అన్ని నియోజకవర్గాల నుంచి డబ్బులిచ్చి మరీ జనాలను తీసుకొచ్చారంట.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి తమ అధినేత జగన్ మెప్పు కోసం పెద్దఎత్తున జనసమీకరణ చేశారు. ఎలాగైనా హెలిప్యాడ్ వద్దకు చేరుకోవాలంటూ ఆ రోజు ఉదయం నుంచే వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు పంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దానికి తగ్గట్లే జగన్ రావడానికి కొద్ది నిమిషాల ముందే వేలమందిని హెలిప్యాడ్ వద్దకు తీసుకొచ్చారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి పార్టీ శ్రేణులను ఉసిగొల్పారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు పోలీసులపై దాడి చేశారు. దీంతో తీవ్ర అస్వస్థత పాలై చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. మొత్తానికి జగన్ దృష్టిలో పడాలన్న తోపుదుర్తి అత్యుత్సాహం ఆయన్ని అలా బుక్ చేసిందిప్పుడు.