అప్పుల చక్రంలో ఆర్థిక వ్యవస్థ? | telangana state economy in trap of debt| land| sales| interst

posted on Apr 12, 2025 3:17PM

అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తేవాడొకడు అని సామెత. ఈ సామెత ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో ఏమో కానీ.. అప్పులు తెచ్చుకొనేందుకు కూడా తెలంగాణ  ప్రభుత్వం ఓ బ్రోకరేజ్‌ సంస్థను పెట్టుకున్నదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన తాజా ఆరోపణ. ఆ ఆరోపణ నిజం అయితే  మాత్రం ఆ సామెత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని అంటున్నారు.  

అఫ్కోర్స్ ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే కాదు.. చాలా వరకు ప్రభుత్వాలది అదే పరిస్థితి. అప్పుల ఊబిలో కూరుకు పోయిన రాష్ట్ర ప్రభుత్వాలు, ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితిలో,ఇలాంటి బ్రోకరేజ్ సంస్థలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలు లేక పోలేదు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అప్పుల కోసం అడ్డదారులు తొక్కిన సందర్భాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. నిజానికి, కేటీఆర్ చేసిన ఆరోపణకు ఆధారం కూడా ఆయన శోధించి సాధించింది కాదు. బీఆర్ఎస్ సభ్యుడు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఆధారంగానే కేటీఆర్ ఈ ఆరోపణలు చేశారు.     

అయితే అంత మాత్రం చేత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల వేట సాగించడం సమర్ధనీయం కాదని ఆర్థిక  నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. నిజానికి గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో కెల్లా పెద్ద తప్పు అభివృద్ధి, సంక్షేమం పేరున అవసరానికి మించి అందిన కాడికి అప్పులు చేయడం. మరోవంక అదే అభివృద్ధి, సంక్షేమం ముసుగులో  లెక్కాపత్రం లేకుండా ప్రభుత్వ భూములను విక్రయించడం. ఫలితంగా ఆర్థిక క్రమ శిక్షణ పట్టాలు తప్పింది. అవినీతి పెచ్చిరిల్లింది. ధనిక రాష్ట్రం ఇదిగో ఇలా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెపుతున్న అప్పులు పుట్టని అధ్వాన స్థితికి చేరిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.   

అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం బాటలో అప్పుల భారం పెంచుకుంటూ పోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై పూర్తి అవగాహన వుంది. ఎందుకంటే.. కట్టే, కొట్టే,తెచ్చే అన్నట్లు మూడు ముక్కల్లో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని  సామాన్యులకు కూడా చక్కగా  అర్థమయ్యేలా పలు సంధర్భాలలో వివరించారు. 

అవును గత బీఆర్ఎస్  ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. ఆ అప్పుల పై నెలనెలా అనివార్యంగా చెల్లించవలసిన అసలు, వడ్డీ తడిసి మోపెడై కూర్చున్నాయి. సర్కార్ బండి కదలడం లేదు అని ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, ఒక దగ్గర కాదు,ఎక్కడంటే అక్కడ లెక్కల చిట్టా విప్పి చెపుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలసరి ఆదాయం రూ. 18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్లు, అందులో ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్లకు రూ. 6,500 కోట్లు, గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు వడ్డీల చెల్లింపుకు మరో రూ. 6,500 కోట్లు.. తప్పించుకోలేని ఈ రెండు పద్దులకు పోనూ సర్కార్ చేతిలో మిగిలేది’ కేవలం రూ.5000 వేల నుంచి రూ.5500 కోట్లు మాత్రమే. ఇందులోంచే  అన్నీ చేయాలని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అద్దంలో ప్రతిబింబంలా చూపించారు. అలాగే కొండలా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఫస్ట్ తేదీన జీతాలు చెల్లించేందుకు పడుతున్న కష్టాల గురించి  ఇలా ప్రభుత్వం  పడుతున్నఈతి బాధలగురించి ఎన్నో సందర్భాలలో చక్కగా చెప్పారు.

అయితే ముఖ్యమంత్రి చెప్పే మాటలన్నీ నిజాలేనా అంటే.. అవున కానీ, కాదని కానీ చెప్పడం కుదరదు.  అలాగే విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  చేసిన తాజా ఆరోపణల విషయంలోనూ… ఆయన అంతా నిజమే చెప్పారని అనుకోనవసరం లేదు. కానీ ఓ వంక గత ప్రభుత్వ నిర్వాకం పుణ్యాన పైసా అప్పు పుట్టడం లేదని అంటూనే.. ఈ 15 -16 నెలల కాలంలో అక్షరాలా లక్షన్నర కోట్లరూపాయలు అప్పు చేసినట్లు సర్కార్ లెక్కలే చెపుతున్నప్పుడు  దాల్ మే కుచ్ కాలా హై అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అదికూడా ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రేవంతే రెడ్డి ప్రభుత్వం అప్పు చేసిందంటే.. కేటీఆర్ చేసిన  ‘బ్రోకరేజ్‌’ ఆరోపణను కొట్టి వేయడం కుదరదని విశ్లేషకులు అంటున్నారు. 

ఇక విషయంలోకి వస్తే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్న కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబందించి ఈ ఆరోపణ చేయడం సంచలనంగా మారిందని అంటున్నారు. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాలను ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి కేటాయించింది. ఆ భూములను టీజీఐఐసీ ద్వారా తాకట్టు పెట్టించి, 2024 డిసెంబర్‌లో రేవంత్‌ సర్కారు రూ.10,000 కోట్ల అప్పు తెచ్చింది. అప్పు సృష్టించి ఇప్పించినందుకు బ్రోకరేజ్‌ సంస్థగా పనిచేసిన  ట్రస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’  రాష్ట్ర ప్రభుత్వం రూ.169,కోట్లు చెల్లించిందని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఆరోపణలు, ప్రత్యారోపణల విషయం పక్కన పెడితే.. అప్పులు, అమ్మకాలపై అధాపడిసాగుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చక్క బడడం, పట్టాలు ఎక్కడం  ఇక కష్టమే అంటున్నారు.



Source link