అమరావతికి మోడీ.. భారీ ప్యాకేజీపై రాష్ట్ర ప్రజల ఆశలు! | modi ap tour confirmed| huge| package| announcement| anticipated| aamarawathi| navyandhra

posted on Apr 17, 2025 11:21AM

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. మోడీ పర్యటనకు, పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి  ఏర్పాట్లు శరవేగంగా జరుగు తున్నాయి. మే2వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పీఎం పర్యటనపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లపై అధికారలతో సమీక్ష నిర్వహించారు.

మోడీ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో అన్నట్లుగా నిర్వహిం చాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మోడీ సభకు దాదాపు 5లక్షల మంది ప్రజల పాల్గొంటారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం వెనక 250 ఎకరాల విస్తీర్ణంలో మోడీ సభ జరగనుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం పడినా ఎటువంటి ఇబ్బందీ లేకుండా సభా స్థలంలో వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ఓకే కానీ గతంలో అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వచ్చిన సందర్భంగా మోడీ పవిత్ర జలాలు, పుణ్య క్షేత్రాల నుంచి మట్టి తీసుకువచ్చారు. ఈ సారి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రానున్న మోడీ ఏం తీసుకువస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ప్రధాని హోదాలో అమరావతి నిర్మాణానికి నరేంద్రమోడీ 2017లో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి మోడీ ఆ సందర్బంగా భారీ వరాలను ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే పుణ్య స్థలాల నుంచి మట్టి, పుణ్య నదుల నుంచి జలం తీసుకువచ్చిన మోడీ ఏపీకి కానీ, ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ఆయన నోటీతోనే చెప్పిన అమరావతికి కానీ ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదు. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.  

దీంతో ఈ సారి మోడీ అమరావతికి ఏం చేస్తారు? ఏం ఇస్తారు? అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అప్పట్లో అంటే 2017లో తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ మాత్రమే. అయితే తెలుగుదేశం మద్దతు లేకంటే కేంద్ర సర్కార్ కు అప్పట్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి అది కాదు. 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో మోడీ సర్కార్ కు తెలుగుదేశం మద్దతు అత్యవసరంగా మారింది. తెలుగుదేవం మద్దతుతోనే మోడీ సర్కార్ మనుగడ సాగుతుందన్న పరిస్థితి ఉంది. దీంతో  కేంద్ర ప్రభుత్వం ఏపీకీ, అలాగే తెలుగుదేశం పార్టీకీ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా కేంద్ర కేబినెట్ బెర్తులు వంటి విషయాలలో పట్టుబట్టకుండా, ఏపీకి ఇతోధిక ఆర్థిక తోడ్పాటుపైనే పట్టుబడుతున్నారు.

ఆ కారణంగానే  అమరావతికి కేంద్రం నుంచి అనూహ్య మద్దతు లభించింది. వరల్డ్ బ్యాంకు రుణంతో పాటుగా హడ్కో రుణాలకు కేంద్రం గ్యారెంటీ ఇచ్చి మరీ అమరావతికి అండగా నిలిచింది. అంతే కాకుం డా అడగకుండానే  అమరావతికి రైల్వే లైను, అవుటర్ రింగు రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను కలిపేలా కొత్త రహదారులు, ఇలా వరాలు ఇచ్చేసింది,  ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ కచ్చితంగా రాజధాని అమరావతికి ఓ భారీ ప్యాకేజీ ప్రకటిస్తారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  సామాన్య జనం నుంచీ రాజకీయ పరిశీలకులు కూడా  అమరావతి పనులకు నిధుల కొరత మాట లేకుండా మోడీ భారీ వరాలను ఇచ్చే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు.  



Source link