posted on Apr 9, 2025 2:39PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి బుధవారం (ఏప్రిల్ 9) భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు.
వేద పండితుల ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది.
సచివాలయం వెనుక ఇ9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం జరగనుంది.రాజధాని కోర్ ఏరియాలో వెలగపూడి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసం ఉండనుంది. 2024 డిసెంబరులో చంద్రబాబు ఇక్కడ ఇంటి నిర్మాణం కోసం ఐదు ఎకరాల రెసిడెన్షియల్ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ఇటీవలే రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఐదు రోజుల కిందటే భూమి చదును పనులు చేపట్టారు. ఆ పనులు మంగళవారం (ఏప్రిల్ 8)తో పార్తయ్యాయి. దీంతో బుధవారం (ఏప్రిల్ 9) భూమి పూజ నిర్వహించారు. ఇంటి నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ఉండగా కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజపై నారా బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నూతన అధ్యాయానికి ఇది ప్రారంభం అని పేర్కొన్నారు.