posted on Jun 10, 2025 1:05PM
అమరావతిపై, అమరావతి మహిళలపై జగన్ మీడియా అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ మీడియాలో ఓ డిబేట్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను ఖండించకుండా వత్తాసు పలికిన ఆ మీడియా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది.
జగన్ మీడియాలో డిబేట్ సందర్భంగా కృష్ణం రాజు అనే సీనియర్ జర్నలిస్టు అమరావతిలోని మహిళ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్.. అమరావతిని వేశ్యల రాజధాని గా పేర్కొనడం.. రాజధాని ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళా రైతులను అవమానించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ జుగుప్సాకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను మహిళాకమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని ఎన్సీడబ్ల్యు చైర్ పర్సన్ విజయా రహట్కర్ పేర్కొన్నారు. మీడియా వేదికగా అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్య లు చేసిన కృష్ణంరాజు, ఆ వ్యాఖ్యలను అడ్డుకోకుండా ప్రోత్సహించిన ఆ మీడియా జర్నలిస్టుపై నిర్దుష్ట కాలపరిమితిలో విచారణ జరిపి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీకి రాసిన లేఖలో ఆదేశించింది. అలాగే అమరావతిపై, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను తమకు మూడు రోజులలోగా సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ డీజీపీని ఆదేశించింది.