posted on Apr 11, 2025 10:16AM
అనగనగా ఒక ఊళ్లో ఒకామె ఉంది. మహా రచ్చలమారి మనిషి. ఆమెతో ఎంత మర్యాదగా ప్రవర్తించినా కూడా ఏదో ఒక రకంగా దాన్ని గొడవగా మార్చేస్తుంది. ఎలాగంటే.. ఆమెను ఎవరైనా ‘అమ్మా’ అని పిలిస్తే.. ‘ఠాట్.. నన్ను అమ్మా అంటావా.. అంత ముసలిదానిలా కనిపిస్తున్నానా.. నేనేమైనా నీ అయ్యకు పెళ్లాన్నా..’ అంటూ గొడవకు దిగుతుంది. అలాకాకుండా, ‘ఏమండోయ్..’ అని పిలిస్తే.. ‘నేనేమైనా నీకు పెళ్లాన్నా.. అంత చనువుగా పిలుస్తున్నావ్’ అంటూ దానికి కూడా గొడవకు దిగుతుంది. అలాంటి వారి గురించి ‘అలవిగాని ఆడదాన్ని అమ్మా అన్నా తప్పే.. ఏమేవ్ అన్నా తప్పే..’ అంటూ పల్లెపట్టుల్లో ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు గమనిస్తే అంతకంటె భిన్నంగా ఏమీ లేదు. పాపిరెడ్డి పల్లె పర్యటనకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల భద్రత, రక్షణ అడిగారు.. పోలీసులు ఏకంగా ఇద్దరు ఎస్పీల ఆధ్వర్యంలో 1100 మంది పోలీసులో ఆ ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఈ సామెత కథ మాదిరిగా ఆయన అనుసరించిన ధోరణిని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి.
జగన్ భద్రతను దృష్టిలో పెట్టుకోవడం వల్లనే పోలీసులు ఆయన అడిగిన చోట కాకుండా.. పాపిరె డ్డిపల్లెకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ కుఅనుమతి ఇచ్చారు. పైగా హెలిప్యాడ్ వద్దకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ రావొద్దని నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. కానీ.. జగన్ రాకకు జనాన్ని తరలించిన స్థానిక నాయకులు మాత్రం.. పోలీసుల మాట వింటే తాము వైసీపీ నాయకులు ఎందుకవుతాం అన్నట్టుగా వ్యవహరించారు. తరలించి తీసుకువచ్చిన జనాలనందరినీ హెలిప్యాడ్ వద్దకు కూడా తోలారు. తీరా అక్కడి పరిస్థితి ఏమిటి? జనం మిక్కిలిగా వచ్చేశారు.. వారిని అదుపు చేయడానికి పోలీసులు ఏ కొంచెం కఠినంగా వ్యవహరించినా సరే.. ‘మా కార్యకర్తల్ని కొట్టేస్తున్నారు.. మా మీద పోలీసులు దాడిచేస్తున్నారు..’ అంటూ గోల చేయాలన్నది వారి కోరిక. అప్పటికీ పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తే.. పోలీసులమీదనే రాళ్లురువ్వి దాడికి దిగారు. అప్పటికీ.. పోలీసులు సంయమనం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. తీరా జనం తాకిడి వల్ల హెలికాప్టర్ కాస్త దెబ్బతింది. తీరా ఇప్పుడు ‘పోలీసులు సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదు. జనం వస్తోంటే చూస్తూ కూర్చున్నారు..’ అని మళ్లీ పోలీసుల మీదనే నిందలేస్తున్నారు.
జగన్ వ్యవహార సరళిని గమనిస్తే.. పాపిరెడ్డి పల్లిలో పోలీసులు ఎంత పటిష్ఠ ఏర్పాట్లు చేసినా సరే.. ఏదో ఒక రకంగా వారి మీద నిందలు వేయాలని, శాంతిభద్రతలు విఫలమవుతున్నాయని ప్రభుత్వం మీద బురద చల్లాలని ముందే ఫిక్సయిపోయి అక్కడకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. బట్టలూడదీసి కొడతానని జగన్ కారుకూతలు కూసినా సరే.. పోలీసులు సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. జగన్ మాత్రం.. ముందే రెండు స్క్రిప్టులు తయారుచేసుకుని ఉన్నట్టుగా.. అంతా ప్రశాంతంగా జరిగినా సరే.. హెలిపాడ్ వద్ద జనం తాకిడి గురించి తమ పార్టీ నాయకులు చేసిన తప్పిదానికి పోలీసులను నిందిస్తున్నారు. హెలిపాడ్ వద్ద గుమికూడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరి మీద పోలీసులు కేసు పెట్టి, అందరికీ నోటీసులు ఇస్తేగానీ ఆపార్టీ కుట్రలు బయటకురావని, వారి లేకిబుద్ధులు బయటపడవని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.