posted on Apr 18, 2025 11:06AM
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఎస్వీ గోశాలలో గోవుల మృతి పై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో టీటీడీ తిరుపతి గోశాల గోవధ శాల గా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. మూడు నెలల కాలంలో 100 గోవులు మృతి చెందాయని పేర్కొన్నారు.
అదే రోజు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, భూమన ఆరోపణలు అవాస్తవమని ఖండిచారు. గోశాల పై అసత్య ప్రచారం మైనుకోవాలని, నేరుగా వస్తే సాక్షాలతో నిరూపిస్తామన్నారు. ఇక ఆ తరువాత రోజుకొక్క అంశంతో ప్రచారం, వాదోపవాదాలు, సవాళ్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇటీవల జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ను కలిసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా గోశాల పై అసత్య ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గోశాల పరిధిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్వీయూ పోలీసులు క్రైమ్ నెంబర్ 62/20 25 బి.ఎన్.ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు కింద భూమన పై కేసు నమోదు చేశారు.
దీనిపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ టీటీడీ, అనుబంధట సంస్థ ల పై ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, టీటీడీ గోశాలలో సహజంగా గోవులు మరణిస్తే దానా సరిగ్గా పెట్టలేదు.. బక్కచిక్కి పోయాయని అసత్య ప్రచారం భక్తుల్లోకి తీసుకెళ్లి టీటీడీ ప్రతిష్ట ను దిగజార్చే విధంగా చేశారని అన్నారు. గో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అసత్య ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ను కోరినట్లు చెప్పారు. అదే ఫిర్యాదు ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాననీ, దానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అసత్య ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు.