posted on Apr 23, 2025 9:47AM
జమ్మూ కశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 27 మంది ఉసురు తీసిన సంఘటనకు నిరసనగా ఉవ్వెత్తున ఆందోళనలు చెలరేగాయి. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రమూకలు జరిపిన దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 27 మంది మరణించిన ఘటనను నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.
పహల్గాంలో స్థానికులు, పౌర సంఘాలు ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధించారు. సంపూర్ణ బంద్ కు పిలుపునిచ్చారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే తరహా ఆందోళనలు జమ్మూ కార్మీర్ వ్యాప్తంగా జరుగుతున్నాయి. జమ్ము సహా రాష్ట్ర మంతటా ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అన్ని రాజకీయ పార్టలూ కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి.