posted on Apr 15, 2025 10:56AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం (ఏప్రిల్ 15) సమావేశమైంది. వెలగపూడి సచివాలయంలో జరుగుతున్నఈ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా సీఆర్డీయే అథారిటీ ఆమోదించిన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీయే కమిషనర్ కు అనుమతి ఇవ్వడం సహా, అసెంబ్లీ , హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లకు పచ్చ జెండా ఊపనుంది.
అలాగే ఎన్ఐపిబీ సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులపై కేబినెట్ ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా రూ.30,667 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్, విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో పాటు పలు కంపెనీల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అదే విధంగా ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు, కుప్పంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు, నెల్లూరులో ఏపీఐఐసీ, విజయనగరంలో గ్రేహౌండ్స, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు భూముల కేటాయింపు విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే ఈ కేబినెట్ భేటీ ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉ:దంటున్నారు. అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ కా ర్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.