posted on Apr 17, 2025 2:32PM
మీ హయాంలో చేసిన పాత తప్పులన్నీ
బయట పడతాయనా?
భూమన బాగోతాల వెనక దాగిన
అసలు రహస్యాలేంటి?
పాత తప్పులను కప్పి పుచ్చుకోడానికి
భూమన చేస్తున్న కొత్త గో గాయాలేంటి?
మడకశిర ఎమ్మెల్యే చెప్పినట్టు.. వెంకటేశ్వరస్వామి అంటే ఎంత మాత్రం భక్తిభావం లేని కరుణాకరరెడ్డి ఏమిటి? ఇంత భారీ ఎత్తున గోనాటకం మొదలు పెట్టడమేంటి? నిజంగానే గోవులపై ఆయనకింతటి ప్రేముందా? ఇందులో దాగిన అసలు మతలబేంటి? అన్నదిప్పుడు ప్రశ్నార్ధకం అయి కూర్చుంది. ఇక్కడ కరుణాకరరెడ్డి గోడ్రామా వెనక కొన్ని కొన్ని ప్రత్యేక కారణాలున్నట్టుగా చెబుతున్నారు. ఇది వరకు గోశాల డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి ఉప్పందించడం వల్లే.. ఈ మొత్తం తంతు భూమన నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ మాజీ గోశాల డైరెక్టర్ పై తొక్కిసలాట వ్యవహారంలో టీటీడీ కఠిన చర్యలు చేపట్టడంతో.. అతడు టీటీడీపై కక్ష కట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. దానికి తోడు ఇతడు భూమనకు అత్యంత ప్రియ శిష్యుడు కావడంతో ఇదంతా వెనకుండి జరిపిస్తున్నట్టు భోగట్టా.
ఆ మాజీ డైరెక్టర్ మాజీ టీటీడీ చైర్మన్ మధ్య మరో సీక్రెట్ కూడా దాగి ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో వీరు విదేశీ గోవుల వ్యవహారంలో స్కామ్ కి తెరలేపారనీ.. ఇది ఎక్కడ బయట పడుతుందో అన్న ఆందోళన కొద్దీ ఈ ఇద్దరూ కలసి ఈ గోమరణాలు అనే తేనెతుట్టె కదిపారనీ అంటున్నారు.
ఇదంతా ఒక నాటకమని తెలిసినా కానీ కూటమి ప్రభుత్వం పెద్దగా తిప్పి కొట్టలేక పోతోంది. దానికి తోడు గోవులకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్టులు, ఆపై తరచూ చనిపోయే గోవులకు సంబంధించిన లెక్కల విషయంలో వారికి వారే సెల్ఫ్ గోల్ వేసుకోవడం భూమనకు బాగా కలిసి వచ్చినట్టయ్యింది.
ఒక పక్క చూస్తే భూమన తన రాజకీయ వారసుడిగా రాణిస్తాడనుకున్న కొడుకు కాస్తా ఆదిలోనే హంసపాదులా.. గత ఎన్నికల్లో ఓడటం. ఆపై కార్పొరేషన్ వ్యవహారంలో అడ్డంగా బుక్ అవడం వంటి అంశాలతో అతడు ఎంత మాత్రం పెర్ఫామెన్స్ చూపించలేక పోతున్నాడు. ఇది గమనించిన భూమన తానే స్వయంగా రంగంలోకి దిగి పార్టీని తిరిగి గాడిలో పెట్టడం, తన ఉనికి కాపాడుకోవడం కోసం ఈ గో డ్రామాకు తెరలేపినట్టు తెలుస్తోంది.
ఇది రెండు విధాలుగా భూమనకు అవసరంగా కనిపిస్తోంది. గతంలో తన పాలనలో టీటీడీలో జరిగిన అవకతవకలు బయట పడకుండా ఉండాలంటే ముందర కాళ్ల బంధం అత్యవసరం. ఇటు చూస్తే కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు ఇంకా ఎన్నో విషయాల్లో భూమన గట్టిగా ఇరుక్కునే విధంగా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే గత ఐదేళ్లలో 2 వేల మంది భారతమ్మ సైన్యం అన్యమతస్తుల రూపంలో తిరుమలలో పెద్ద ఎత్తున కీలక శాఖలలో కీలకంగా పని చేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరందరి ద్వారా ఇన్నాళ్ల పాటు సాగిన విధ్వంసం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పడే ప్రమాదముంది.
టీటీడీకే అత్యంత కీలకమైన ఆన్ లైన్ బుకింగుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ టికెట్లతో పాటు పాసుల జారీ వరకూ భారీ ఎత్తున గోల్ మాల్ జరిగినట్టు కనిపిస్తోంది. ఒక్క రోజానే వేల కొద్దీ పాసులు జారీ చేసి.. లక్షల్లో వసూలు చేశారని అంటున్నారు. ఇవన్నీ బయట పడకుండా ఉండాలంటే ఇదే సరైన పనిగా భూమన ఈ గోనాటకాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
ఒక పక్క టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు బాద్యతలు చేపట్టినప్పటి నుంచి తరచూ ఏవో వివాదాలు. తొక్కిసలాట గొడవలు, ఏకంగా ఒక బోర్డు మెంబరే బూతులు, ఇక మహా ద్వారం ముందు వరకూ చెప్పులేసుకుని రావడాలు, ఫోటో షూట్లు, డ్రోన్లు ఆనంద నిలయం మీద ఎగరడాలు.. వంటి వివాదాస్పద అంశాలతో వరుసగా దెబ్బలు తింటూ వస్తున్న పాలక మండలిని మరింత ఇరకాటంలో పడేయటానికి.. గో మరణాల వ్యవహారాన్ని ముందుకు తేవడంతో ఇటు టీటీడీ పాలక మండలి, అటు ఈవో సైతం ఇబ్బందుల్లో పడ్డారని తెలుస్తోంది.
అయితే ఇదంతా ప్రతిపక్ష పార్టీ పారిస్తోన్న పాచికగా.. కేబినెట్ భేటీల్లో గుర్తించిన మంత్రి మండలి.. దీన్ని తిప్పి కొట్టే కార్యాచరణ తయారు చేయాలనుకున్నా.. అదెలాగో వారికంటూ ఒక అంచనా లేక పోవడంతో భూమన గోనాటకం రక్తి కడుతోందని అంటున్నారు. దీంతో గోవుల సంఖ్య నుంచి స్వామి వారికి తరచూ తీసుకెళ్లే పాల వరకూ ఆయన లెక్కలు బయటకు తీస్తుంటే, ఇక్కడ పాలకమండలి బుర్ర తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో భూమన మరో అడుగు ముందుకేస్తూ ఏనుగులకు, గుర్రాలకూ సరైన ఆహారం అందించలేక పోతున్నారనే విషయాల వరకూ ఏకరవు పెడుతున్నారు. అక్కడితో చాలక నిషేధమున్న కొండ మీద మద్య మాంసాల వ్యవహారాలను సైతం జనం ముందుకు తెస్తూ.. గతంలో తమ పాలనలో జరిగిన లోటు పాట్లు బయటకు పొక్కకుండా గట్టి కోటగోడే కడుతోంది కరుణాకర్ రెడ్డిలోని రాజకీయ చతురత.
అందుకే ఆయన ఫేక్ ఫోటోలు వీడియోలతో చేసే ప్రచారం సైతం చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. ఇదే తెలంగాణలో కంచె గచ్చిబౌలీ భూముల వ్యవహారంలో ఫేక్ వీడియోలు, ఫోటోలను షేర్ చేసిన స్మిత సబర్వాల్ వంటి వారిని కూడా వదిలి పెట్టుకుండా కేసులు బుక్ చేస్తున్నారు. నోటీసులు పంపుతున్నారు. అలాంటిదిక్కడ కనుచూపు మేర కూడా కనిపించడం లేదు. భయపెట్టడానికైనా కేసులు, నోటీసులు పంపలేక పోవడంతో.. భూమన రోడ్డు మీద కొచ్చి మరీ మహాభారతంలో గోగ్రహణం అంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు.
గురువారం శ్రీవారి నిజనేత్ర దర్శనం జరుగుతుందని అంటారు. ఆ రోజు స్వామివారి పట్ల తప్పు ఎవరు చేస్తున్నారో వారి బండారమంతా బయట పడుతుందని చెబుతారు. అలాంటి గురువారం ఎప్పుడొస్తుంది? ఈ గోనాటకాల వెనక దాగిన రహస్యాలు ఎప్పుడు బయట పడుతాయో ఎదురు చూస్తున్నారు స్వామివారి భక్తులు.