ఏ దేశ మేగినా ఎందు కాలిడినా.. | rahul anti nation comments abroad| spark| criticism | all| fronts

posted on Apr 23, 2025 2:47PM

రాహుల్ అమెరికా పర్యటన పై  దుమారం 

ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, అన్నారు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. కానీ, దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన, నెహ్రూ గాంధీల కుటుంబం నాలుగో తరం నేత రాహుల్ గాంధీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఏదేశం వెళ్ళినా, భారత దేశాన్ని అవమానించడం, అవహేళన చేయడం అలవాటుగా చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.  ఇప్పడు దేశంలో ఆహుల్ గాంధీ అమెరిక పర్యటనలో చేసిన ఆరోపణలు  వివాదాస్పదంగా మారాయి. వివరాల లోకి వెళితే ..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ ఎప్పుడు ఏ దేశం వెళ్ళినా.. భారత దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారా? అసలు అందుకోసమే ఆయన తరచూ విదేశాల్లో పర్యటిస్తారా?  అంటే  అవునని, అనుకోవాల్సిన విధంగానే ఆయన నడక, నడత, మాటా ఉంటున్నాయని  విశ్లేషకులు అంటున్నారు. నిజానికి రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్యు లలోనూ ఇదే  అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఇదనే కాదు.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు సంబంధించి చాల చాలా సందేహాలున్న మాట నిజం. గతంలో ఆయన చివరకు  కాంగ్రెస్ పార్టీకి అయినా  సరైన  సమాచారం లేకుండా సాగించిన విదేశీ పర్యటనలు వివాదాస్పదం అయ్యాయి. అలాగే, రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా.. ఇక్కడ మన దేశంలో ఎక్కడో అక్కడ  నిన్నటి ‘పహల్గాం’ ఉగ్రదాడి,వంటి అవాంఛిత సంఘటనలు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు  పహల్గాం  ఉగ్రదాడి, వంటి సంఘటనలు సంబంధం వుందో లేదో కానీ, అనుమానాలు అయితే ఉన్నాయి. 

ఇతర ఆరోపణలు  ఎలా ఉన్న.. రాహుల్ గాంధీ విదేశాల్లో చేస్తున్న, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శల పట్ల రాజకీయ ప్రత్యర్దులే కాదు, స్వపక్షీయులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ..  ముఖ్యంగా నెహ్రూ గాంధీ కుటుంబ అభిమాన పాత్రికేయులు, సైతం రాహుల్ గాంధీ  విదేశాల్లో భారత దేశంపై విమర్శలు చేయడం మంచిది కాదని హిత బోధ చేశారు. అంటే.. రాహుల్ ప్రవర్త దేశానికే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబానికి కూడా తలవంపులు తెచ్చేలా ఉందని  అంటున్నారు. 

అవును  గతంలో రాహుల్ గాంధీ ఇంగ్లాండ్ లో పర్యటించిన సందర్భంలో, బారతీయ ములాలున్న సీనియర్ జర్నలిస్ట్  ఒకరు, నెహ్రూ,ఇందిరా గాంధీలు విదేశీ గడ్డపై ఏనాడూ భారత దేశానికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడ లేదని విలేకరుల సమావేశంలోనే గుర్తు చేశారు. ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరా గాంధీని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో, ఇంగ్లాండ్ లో పర్యటించిన   ఇందిరాగాంధీని పాత్రికేయులు ఆమెను  జైలు  జీవితం గురించి ప్రశ్నించారు. అయితే, ఆమె, ‘నాదేశం గురించి నేను పరాయి దేశంలో తప్పుగా మాట్లాడను. అది నా సంస్కారం కాదు  అని జవాబిచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి మరీ రాహుల్ గాంధీకి, ఇది పద్దతి కాదని హిత బోధ చేశారు. అయినా  ఆయన మారలేదు. 

నిజానికి  ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ  చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు దేశంలో దుమారం రేపుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భాగంగా బోస్టన్‌ లో జరిగినన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎప్పుడో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తన బాధ్యతల నిర్వహణలో రాజీ పడిందని ఆరోపించారు. నిజానికి ఇది ఇప్పడు కొత్తగా చేసిన ఆరోపణ కాదు. గతంలోనూ. ముంబైలో ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియ సూలే, శివసేన(యుబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తో కలిసి ఇవే ఆరోపణలు చేశారు. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వివిరణ ఇచ్చింది. నిజానికి  రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని, అప్పట్లోనే మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  సవాల్ విసిరారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం కోర్టులో కేసు వేసే సాహసం చేయలేదు. 

నిజానికి, రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శించడం తప్పు కాదు, కానీ, విదేశాలకు వెళ్లి.. అక్కడ భారత రాజ్యాంగ వ్యవస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం తప్పు మాత్రమే కాదు నేరం కూడా అవుతుందని అంటున్నారు. అయితే.. రాహుల్ గాంధీ, దేశంలో అయినా విదేశాల్లో అయినా ఆరోపణలు చేయడమే కానీ వాటిని నిరూపించే ప్రయత్నం ఏనాడు చేయలేదు. 

నిజానికి.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  భారత ఎన్నికల వ్యవస్థను ఎంతగానో మెచ్చుకున్నారు. గోల్డ్ స్టాండర్డ్,    సర్వోత్తమం అని అభివర్ణించారు. డోనాల్డ్ ట్రంప్ మాటల్లోనే చెప్పుకోవాలంటే,’ Indian election system is most transparent, secure and most efficient system in the world, it is time we learn from it’ అన్నారు. అయితే.. అదే అమెరికాలో, ప్రతిపక్ష నేత హోదాలో ఆ దేశంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ భారత ఎన్నికల వ్యవస్థపై చాల తీవ్రమైన ఆరోపణలు చేశారు, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఓటు వేసే వయసున్న మొత్తం వ్యక్తుల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు.  పోలింగ్ రోజు చివరి రెండు గంటల్లో 65 లక్షల మంది ఓటు వేసారని..  అది అసాధ్యమని.. గంటలు,  నిముషాల లెక్కలు చెప్పారు. ఎన్నికల సంఘం తన బాధ్యతల  నిర్వహణలో రాజీ పడిపోయిందని, అంతే కాక వ్యవస్థలోనే ఏదో లోపముందని కూడా తెలుస్తోందని అమెరికాలో ఆరోపించారు.

నిజానికి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల  పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు 6.40 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే సగటున గంటకు 58 లక్షల మంది ఓటు వేశారు. ఈ సరళి ప్రకారం చూస్తే చివరి రెండు గంటలల్లో సుమారుగా 1.16 కోట్ల మంది ఓటు వేసి ఉండాలి. కానీ ఈ  రెండు గంటల్లో, రాహుల్ గాంధీనే  65 లక్షల మంది  ఓటు హక్కు వినియోగించుకున్నారని, అంటే సగటు ఓటింగ్ సరళి కంటే చివరి రెండు గంటల్లో పోలింగ్ తగ్గిందని  ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.  

అయినా సరే.. రాహుల్ గాంధీకి ఎన్నిక సంఘం పై విశ్వాసం లేక పొతే, దేశంలో కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. ఆయన నిత్యం చేతిలో పట్టుకు తిరగే రాజ్యాంగం వుంది. కానీ, ఇవేవీ కాదని అమెరికాలో భారత రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు చేయడం ఏమిటి? ఎవరి కోసం.. బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా, మన దేశానికీ వ్యతిరేకంగా. అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న అంతర్జాతీయ కుట్ర దారు జార్జ్ సోరోస్  కోసమా ?  లేక మెడకు చుట్టుకుంటున్ననేషనల్ హెరాల్డ్ ఉచ్చు నుంచి దృష్టి మరల్చేందు కోసమా ? ఎందుకు?



Source link