ఐపీఎల్ లో హైదరాబాద్ బడా బాబు ఫిక్సింగ్ తంత్రం | hyderabad business man match fixing in ipl| bcci| caution| teams| franchaises| not| to| fell| in| his

posted on Apr 17, 2025 2:03PM

ఐపీఎల్‌ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా?  తెర వెనక ఐపీఎల్ జట్లను నయానా భయానా లొంగదీసుకోవటానికి హైదరాబాద్ కేంద్రంగా లాబీయింగ్ నడుస్తోందా?  హైదరాబాద్‎లోనే ఓ బడా వ్యాపారవేత్త ఈ ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడా?  అంటే అవుననే సమాధానం వస్తుంది.  ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్ని ఐపీఎల్ జట్ల ఆటగాళ్లకు బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చింది. 

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు..  ఏదో ఒక వివాదం లేకుండా సీజన్ పూర్తి కాదు. తాజాగా జరుగుతున్న సీజన్ అందుకు మినహాయింపు కాదు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఐపీఎల్ సీజన్‌లో వెలుగు చూస్తున్న వివాదాలు కొంత తగ్గాయన్న మాట వినిపిస్తోంది.  అందుకు చెక్ పడేలా.. తాజాగా బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగటం.. స్పష్టమైన హెచ్చరికను జారీ చేయటం సంచలనంగా మారింది.

ఐపీఎల్ ఎడిషన్ 18 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు సగం మ్యాచులు ఆడేశాయి. మరో ఆఫ్ సీజన్ మిగిలి ఉంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫస్ట్ హాఫ్ సక్సెస్‎ఫుల్‎గా కంప్లీట్ అయ్యింది. ఓ వైపు పరుగుల వరద పారుతుండగా.. కొన్ని మ్యాచుల్లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్‎లను కూడా టర్న్ చేశారు.  ఇలా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోన్న ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్  చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి చట్టవ్యతిరేక పనులు చేసేలా వ్యక్తుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నట్లుగా బీసీసీఐ వెల్లడించింది. ఈ సందర్భంగా ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆ వ్యాపారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్రికెటర్లు.. కోచ్‌లు.. సహాయ సిబ్బంది.. వ్యాఖ్యాతలు.. ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అతనికి దూరంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు.. బీసీసీఐ హెచ్చరించడం సంచలనంగా మారింది.

అయితే గతంలో క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్‎లు చేసిన అనుభవం ఆ వ్యాపారవేత్తకు ఉందని.. అతడికి పంటర్లు, బుకీలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని బీసీసీఐ పేర్కొంది. అతడు మళ్లీ యాక్టివ్ అయ్యాడని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు జట్టు యజమానులు, ఆటగాళ్లను కలిసేందుకు ట్రై చేస్తున్నాడని.. అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. డబ్బే కాకుండా విలువైన వస్తువులు, గిఫ్ట్‎లు ఎరగా వేస్తాడనీ, కుటుంబ సభ్యులకు కూడా విలువైన గిఫ్టులు పంపి  రొంపిలోకి లాగుతాడని హెచ్చరించింది. అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని సూచించింది. బుకీల వలలో చిక్కుకుని భవిష్యత్ పాడు చేసుకోవద్దని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ఎవరీ హైదరాబాదీ వ్యాపారి? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఒక బిగ్ షాట్ ను ఉద్దేశించి ఈ తరహా వార్నింగ్ లు ఇచ్చింది లేదని చెబుతున్నారు. ఐపీఎల్ వ్యక్తులతో స్నేహం చేయటానికి.. సంబంధాలు పెంచుకోవటానికి సదరు వ్యాపారి ప్రయత్నిస్తున్నట్లుగా బీసీసీఐ పేర్కొంది. ఖరీదైన బహుమతులతో బుట్టలో వేసుకోవటం అనే వ్యూహాన్ని అమలు చేస్తున్న సదరు వ్యాపారి.. ఇప్పటికే పలువురికి ఖరీదైన బహుమతుల్ని ఇచ్చి కొందరితో పరిచయాలు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



Source link