posted on Apr 11, 2025 9:42AM
ఒంటిమిట్ట కోదండ రాముడి కల్యాణోత్సవం శుక్రవారం (ఏప్రిల్ 11) సాయంత్రం జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా పుష్పాలంకరణకు 12 టన్నుల పూలను వినియోగిస్తున్నారు. కోదండరాముని కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తుల తరలి వస్తారన్న అంచనాలతో భక్తుల రద్దీ తగ్గట్టుగా ఏర్పాటు పూర్తయ్యాయి.
భక్తుల భద్రత, సౌకర్యాలకు ఎక్కడా లోటు రాకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కల్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్ తదితర పనులు పూర్తయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. రాములోరి కల్యాణానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 70 వేల తిరుమల లడ్డూలను సిద్ధం చేసింది.