ఒక్క పరుగుకే ఔట్‌ అయిన ధోనిపై విరుచుకు పడిన యంగ్‌ హీరో!

ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ జార్ఖండ్‌కి చెందినవాడు అయినప్పటికీ తమిళనాడు ప్రజలు అతన్ని సొంత మనిషిలా భావిస్తారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఐపిఎల్‌లో చెన్నయ్‌ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం వల్ల అతనిపై కాస్త ఎక్కువ అభిమానాన్ని చూపిస్తారు. ఇప్పటివరకు జరిగిన ఐపిఎల్‌లో ఐదు సార్లు కప్పు గెలిచింది చెన్నయ్‌. దానికి ప్రధాన కారకుడు ధోని అని చెబుతారు. తమిళనాడు క్రీడాభిమానులే కాదు, దేశవ్యాప్తంగా చెన్నయ్‌ జట్టుకు మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. దానికి కారణంధోనీయే. అయితే గత కొన్నాళ్లుగా అతని ఫిట్‌నెస్‌ తగ్గుతూ వస్తోంది. 44 ఏళ్ళ వయసు కూడా దానికి కారణం కావచ్చు. అయితే ధోనీ మాత్రం ఇంకొంత కాలం ఆడాలనుకుంటున్నాడు. 

ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌ మ్యాచ్‌లలో చెన్నయ్‌ చాలా వీక్‌గా ఉంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు ఓడిపోయింది. ప్లేయర్స్‌ సరిగా ఆడకపోవడం వల్ల అభిమానుల్లో ఆగ్రహం పెరుగుతోంది. తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో చెన్నయ్‌ ఘోరంగా ఓడిపోయింది. కెప్టెన్‌ ధోని ఒక్క పరుగుకే ఔట్‌ అయిపోయాడు. దీంతో ధోని మీద సొంత అభిమానుల నుంచే విమర్శలు తప్పట్లేదు. బ్యాటింగ్‌ ఆర్డర్లో తొమ్మిదో స్థానంలో వచ్చిన ధోనీ ఒక్క పరుగే చేయడం, వెంటనే ఔట్‌ అవడం అభిమానుల్ని విపరీతంగా బాధించింది. 

అలా బాధపడిన వారిలో తమిళ్‌ హీరో విష్ణు విశాల్‌ కూడా ఉన్నాడు. ఆ కోపంలో ధోనిపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ‘నేను కూడా క్రికెటర్‌నే. పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. అందుకే ఫలితాల్ని చూసి వెంటనే రియాక్ట్‌ అవ్వకుండా నన్ను నేను తమాయించుకుంటున్నాను. కానీ, చెన్నయ్‌ ఆట తీరు మాత్రం చాలా దారుణం. ధోని లాంటివారు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చివరలో రావడం దేనికి అనేది అర్థం కాలేదు. గెలవ కూడదని ఆడడం మనం ఏ ఆటలోనైనా చూశామా. ఆటగాడంటే అభిమానం ఉన్నా అది ఆట కంటే ఎక్కువ మాత్రం కాదు’ అని ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌లో ధోనీ పేరు ప్రస్తావించకపోయినా చివరలో బ్యాటింగ్‌కి వచ్చింది ధోనీయే. కాబట్టి ఈ ట్వీట్‌ అతనిని ఉద్దేశించే విష్ణు విశాల్‌ పెట్టాడనేది అర్థమవుతోంది. ఈ ట్వీట్‌ విషయంలో కొందరు అతన్ని విమర్శిస్తున్నా.. కొందరు మాత్రం అతను చేసిన కామెంట్‌ కరెక్టేనని సమర్థిస్తున్నారు. 



Source link