సినిమాపేరు: ఓదెల 2
నటీనటులు: తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట సింహ, మురళి శర్మ, నాగ మహేష్ శ్రీకాంత్ అయ్యంగార్, పూజారెడ్డి, యువ, వంశీ, శరత్ లోహితష్వ తదితరులు
సినిమాటోగ్రఫి:సౌందర రాజన్
ఎడిటర్: అవినాష్
సంగీతం: అజనీష్ లోక్ నాధ్
బ్యానర్: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్
నిర్మాత: మధు
దర్శకత్వం: అశోక్ తేజ
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్ నంది
ఓదెల పార్ట్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కిన ఓదెల 2 (Odela 2)ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. తమన్నా శివశక్తి గా చెయ్యగా, దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చాడు. వీటితో పాటు ప్రచార చిత్రాలు ఆడియెన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చెయ్యడంతో పార్ట్ 2 పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
‘ఓదెల’ గ్రామంలో తిరుపతి (వశిష్ఠ) అనే ఒక రేపిస్టు పెళ్లి కూతుళ్లపై శోభనం రోజు దాడి చేసి మానభంగం చేస్తుంటాడు. దీంతో తిరుపతిని భార్య రాధ(హెబ్బా పటేల్) చంపేస్తుంది. కానీ గ్రామస్థులు తిరుపతిని కాల్చకుండా నిలువుగా నుంచో బెట్టి పూడ్చుతారు. కానీ తిరుపతి మళ్ళీ వేరే వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశించి శోభనపు పెళ్లి కూతుళ్ళని మానభంగం చేసి చంపుతుంటాడు. పరిష్కారం కోసం జైల్లో ఉన్న రాధని గ్రామస్థులు కలుస్తారు. 12 ఏళ్ళ వయసులోనే ఇంటి నుంచి వెళ్లిపోయి శివస్తుతి గా మారిన తన సోదరి బైరవి(తమన్నా) ని కలవమని రాధ చెప్తుంది. భైరవి 12 ఏళ్ళ వయసులోనే ఇంటి నుంచి ఎందుకు వెళ్ళింది? భైరవి ని కలవమని మాత్రమే ఎందుకు చెప్పింది? భైరవి ఇన్నాళ్లు ఎక్కడ పెరిగింధి? తిరుపతి ఆత్మకి ఏమైనా శక్తులున్నాయా? అసలు గ్రామస్థులు తిరుపతిని ఎందుకు నిలువుగా పూడ్చారు? ఓదెల గ్రామాన్ని తిరుపతి భారీ నుంచి భైరవి ఎలా కాపాడింది? అనేదే ఈ కథ.
ఎనాలసిస్
ఓదెల పార్ట్ 1లో వరుస హత్యలు జరుగుతుంటే, ఆ హత్యలు ఎవరు చేసారనే క్యూరియాసిటీ ఉండేది. కానీ పార్ట్ 2 లో ముందుగానే కథ ఎలా ఉంటుందో, తమన్నా క్యారక్టర్ కూడా ఎలా ఉండబోతుందో ప్రచార చిత్రాల ద్వారా అర్ధమయింది. దీంతో సస్పెన్సు ఒక లెవల్లో ఉండాల్సింది పోయి, కమర్షియల్ కథ సాగినట్టుగా సాగింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఒక ఏడు సంవత్సరాల పాప రక్తం కారుతు ఉన్న రాధ తల తీసుకొని స్టేషన్ కి వెళ్తుంది. ఈ సీన్ మూవీ పై క్యూరియాసిటీ కలిగించింది. ఆ తర్వాత నడిచిన కధనాలు కూడా బాగున్నాయి. సస్పెన్సు కూడా ఒక రకంగా బాగానే పండింది. తమన్నా పాత్ర పరిచయం, ఆమె లక్ష్యం కూడా సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని కలిగించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా హైలెట్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తమన్నా, తిరుపతి మధ్య వచ్చే సన్నివేశాలు తేలిపోయాయి. హెబ్బా పటేల్ క్యారక్టర్ ని ముగింపు చెయ్యడంతో తమన్నా క్యారక్టర్ డౌన్ అయ్యింది. పైగా తిరుపతి క్యారక్టర్ భైరవి ని కోరుకోవడం అరుంధతి మూవీని గుర్తు చేసింది. నంది వచ్చిన సన్నివేశంతో ఎండ్ చేసినా బాగుండేది. శివుడ్ని రప్పించడం కోసమే నందిని మళ్ళీ వెనక్కి పంపించినట్టుగా ఉంది. సెకండ్ హాఫ్ లో కథనాల్ని కాకుండా గ్రాఫిక్స్ ని ఎక్కువుగా నమ్ముకున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
భైరవి గా తమన్నా(Tamannaah)పెర్ ఫార్మెన్స్ ప్రేక్షకులని మెప్పించే స్థాయిలో సాగింది. ఆ క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్లు సూటయ్యింది. విలన్ గా చేసిన వశిష్ఠ నటన గ్రాఫిక్స్ వరకే పరిమితమైందని చెప్పవచ్చు. హెబ్బా పటేల్, ముస్లిం క్యారక్టర్ లో చేసిన మురళి శర్మ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. మిగతా ఆర్టిసుల పెర్ ఫార్మెన్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. సంపత్ నంది(Sampath nandi)కథనాలు చివరలో గాడి తప్పాయి. డైలాగ్స్ పై ఇంకొంచం శ్రద్ధ పెట్టాల్సింది. దర్శకత్వం పని తీరుని మెచ్చుకోవచ్చు. అజనీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ మాత్రం ఎక్స్ లెంట్.
ఫైనల్ గా చెప్పాలంటే..
ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ అంతగా మెప్పించలేదనే చెప్పాలి.
రేటింగ్: 2.5/5
అరుణాచలం