posted on Apr 16, 2025 3:08PM
కంచ గచ్చిబౌలి హెచ్సీయూ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మరోసారి షాకిచ్చింది. నేడు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణం రక్షించడం మన బాధ్యత అని ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్ధించుకోవడం ఏంటని జస్టిస్ బీఆర్ గవాయి మండిపడ్డారు.చెట్ల పునరుద్ధరణపై ప్రభుత్వం వెంటనే ఓ ప్రణాళికతో రావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర సీఎస్ను కాపాడాలనుకుంటే.. విధ్వంసం సృష్టించిన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్విని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ లాయర్ బదులిస్తూ..ఫేక్ వీడియోలతో విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాయని కోర్టుకు తెలిపారు.
ప్రస్తుతం పనులు జరగడం లేదని చెప్పారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు విషయంలో స్టేటస్ కో ఉంటుందని చెప్పింది. అనంతరం తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. వారంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మీరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని.. ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలివ్వాల్సి వస్తుందని తెలిపారు. ఆ భూముల్లో పర్యవరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు? ఎంత టైం పడుతుంది? జంతువులను ఎలా సంరక్షిస్తారో చెబుతూ.. 4 వారాల్లో ప్రణాళికను ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీ చేసింది.