కమల దళంలో అంతర్మథనం.. కొత్త శకానికి శ్రీకారం? | Infighting in BJP| new| era| dawning|rss| modi| government| deputu

posted on Apr 22, 2025 9:48AM

భారతీయ జనతా పార్టీలో ఏమి జరగుతోంది? జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? తెలంగాణ సహా అనేక ఇతర రాష్ట్రల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ఎందుకు ముడిపడడం లేదు? అందుకు పార్టీ నేతలు చెపుతున్న కారణాలేనా లేక ఇంకా లోతైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే, కమల దళంలో జరుగతున్న పరిణామాల వెనక  లోతైన కారణాలే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. నిజానికి పైకి కనిపిస్తున్నడానికి లోపల జరుగతున్న పరిణామాలకు పొంతనలేదని అంటున్నారు.

 అవును ఢిల్లీలో చోటు  చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే..  భవిష్యత్ లక్ష్యాలు, భవిష్యత్ వ్యూహాలు ఆధారంగా ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో అనివార్యంగా  చేపట్టవలసిన  పెను మార్పులపై లోతైన చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే  పైకి అంతా బాగుందన్నట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా అనేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఒకదానితో ఒకటి ముడి పడిన కీలక నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని అంటున్నారు.  ఇటీవల  అటు ఢిల్లీలో ఇటు నాగాపూర్ లో అగ్రనేతల వరస సమావేశాలు కేవలం పార్టీ అధ్యక్షుని ఎన్నికకు పరిమతం కాదని.. అంతకు మించిన అంతర్మధనం జరుగుతోందని  విశ్లేషకులు అంటున్నారు. 

ముఖ్యంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగపూర్ పర్యటన (మార్చి30) తర్వాత, చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయని, అంటున్నారు.  అలాగే  బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధాల విషయంలోనూ పునఃసమీక్ష జరుగుతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఆర్ఎస్ఎస్ వందేళ్ళ పండగను పురస్కరించుకుని, సంఘ్ పరివార్ ఎజెండాలో మిగిలి  ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాలని ఆర్ఎస్ఎస్ బావిస్తోందని అంటున్నారు .అందులో భాగంగా పార్టీ పైన, ప్రభుత్వం పైన కూడా నాగపూర్ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండేలా,  ఢిల్లీ పై నాగపూర్ పట్టు బిగిస్తోందని అంటున్నారు. 

మళ్ళీ ఉప ప్రధాని?

 ఈ నేపధ్యంలో  రానున్న రోజుల్లో ఇటు బీజేపీలో, అటు ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయని, అంటున్నారు. ఇందులో భాగంగా, గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఉన్న ఉప ప్రధాని పదవిని పునరుద్దరించే ఆలోచన ఉందని అంటున్నారు. వాజ్ పేయి ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్న అద్వానీకి  2002లో ఆర్ఎస్ఎస్ ఆలోచన మేరకే   పదోన్నతి లభించిందనీ, ఇప్పడు కూడా, ఆర్ఎస్ఎస్ ఆలోచన మేరకే మళ్ళీ  ఉప ప్రధాని పదవిని పునరుద్దరించాలని  భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..  అప్పటిలాగా ఇప్పడు కూడా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు పదోన్నతి లభిస్తుందా? ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలలో ఒకరిని అదృష్టం వరిస్తుందా? అన్నది   తెలియాల్సి ఉందంటున్నారు.  నిజానికి, ప్రస్తుతం  బీజేపీ ముందున్న ప్రధాన సమస్య, ప్రధాన చిక్కు ముడి ఇదే అంటున్నారు.

ఈ రోజు  ఉప ప్రధాని రేపటి  ప్రధాని?

అవును. 2002లో ఉప ప్రధానిగా పదవిని చేపట్టిన అద్వానీ, 2004 ఎన్నికలలో  బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా తెరపైకి వచ్చారు. అటల్జీ ప్రధానిగా ఉన్న సమయంలోనే అద్వానీని బీజేపీ, ఎన్డీఎ కూటమి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించింది. సరే.. ఆ ఏన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ బండి తిరగబడింది. కాంగ్రెస్ సారథ్యంలోని యుపీఎ అధికారంలోకి వచ్చింది. అద్వానీ, ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. తిరిగి 2009 లోనూ ఆయనే ప్రధాని అభ్యర్ధిగా బీజేపీ బరిలో దిగింది. అయితే మళ్ళీ అదే ఫలితం ఎదురైంది. అద్వానీ మరోసారి బస్సు మిస్సయ్యారు.   అది వేరే విషయం.  అదలా ఉంచితే, ఇప్పడు మళ్ళీ అదే ఆనవాయితీ కొనసాగితే, ఈ రోజు ఉప ప్రధాని ఎవరైతే వారే రేపటి (2029) ప్రధాని అభ్యర్ధి అవుతారు. అందుకే. పార్టీలో  ఇంతటి అంతర్మథనం సాగుతోందని, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, మోదీ సహా చాలా మంది సీనియర్లు తెరమరుగు అవుతారని, కొత్త తరం తెరపైకి వస్తుందనీ,  కమల దళంలో కొత్త శకానికి శ్రీకారం చుడుతుందని అంటున్నారు.



Source link