posted on Apr 17, 2025 2:17PM
ఎయిర్పోర్ట్ ట్వీట్ పై హై కమాండ్ క్లాస్
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి.. తెలుగుదేశంలో హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన ఆయన.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే.. మంత్రి పదవి ఆశించారు. కానీ, వివిధ సమీకరణాలతో ఆయనకు కేబినెట్ లో ఛాన్స్ దక్కలేదు. దాంతో.. తన పని తాను చేసుకుంటున్నారు. పర్లేదు.. అంతా బాగానే నడుస్తోందనుకుంటున్న టైమ్లో.. గంటా వ్యవహారశైలిలో మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఈ మధ్యకాలంలోనే తన నియోజకవర్గంలో ఓ ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయ్. పారిశుద్ధ్య నిర్వహణపై ఓ శానిటరీ ఇన్స్పెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో.. రాస్కెల్ అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయ్. ఇవేవీ చల్లారకముందే విశాఖ నుంచి అమరావతికి విమాన సర్వీసులు లేకపోవడంపై చేసిన గంటా చేసిన ట్వీట్.. రాజకీయంగా చర్చనీయాంశమైంది. విశాఖ విమాన సర్వీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. గంటా శ్రీనివాసరావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. అది కాస్తా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్గా మారింది.
తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రాంమోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సీప్లేన్ల ఏర్పాటు, అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఇతర వసతులు ఏర్పాటు చేయడంలో.. కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు కృషి చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా విమాన సర్వీసులు పెంచే విధంగా.. ఆయన పనిచేస్తున్నారు.
సరిగ్గా.. ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. విశాఖ నుంచి నేరుగా అమరావతికి విమాన సర్వీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది. వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే.. విశాఖలో ఫ్లైట్ ఎక్కి.. తెలంగాణలోని శంషాబాద్లో దిగి.. అక్కడి నుంచి మరో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అమరావతికి రావాల్సి వస్తోందని అందులో రాసుకొచ్చారు. తనతో పాటు వచ్చిన సీఐఐ, ఫిక్కీ సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురైందన్నారు. మంగళవారం వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో.. తాను రెండు విమానాలు మారాల్సి వచ్చిందని తన అసహనాన్ని వెళ్లగక్కారు. విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకీ దుస్థితి అంటూ తన ట్వీట్లో.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్కు ట్యాగ్ చేశారు. దీనికి.. తెలుగుదేశం హైకమాండ్ హర్ట్ అయిందట. దాంతో.. గంటా వ్యవహారంపై అధిష్టానం స్పందించాల్సి వచ్చిందనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో విశాఖ నుంచి ఏపీ రాజధాని అమరావతికి నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం ఏమిటని.. గంటా ట్వీట్ చేయడం పెద్ద చర్చకే దారితీసింది. పార్టీలో సీనియర్ నాయకుడు.. సమస్యపై స్పందించే తీరు ఇది కాదనే విధంగా అధిష్టానం ఆయనను మందలించిందన్న గుసగుసలు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నాయ్. ఇబ్బందులేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి.. టీడీపీకి చెందిన వారేననే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారట. భవిష్యత్లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని అధిష్టానం గంటాకు సూచించిందని.. తెలుగుదేశం నేతలు చర్చించుకుంటున్నారు.
గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అవంతి శ్రీనివాస్తో విభేదాలు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక.. ఎప్పుడు పార్టీ వీడతారోనని ఐదేళ్లు సస్పెన్స్ కొనసాగిన పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి అవుతారనుకున్నా.. ఆ అవకాశం దక్కలేదు. దాంతో.. ఏదో రకంగా, ఏదో ఒక ఇష్యూపై.. గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వెళ్లగక్కడంపై.. పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడు అధిష్టానం హెచ్చరికతోనైనా.. గంటా తీరు మారుతుందా? లేక.. ఇలాగే కొనసాగుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.