posted on Apr 23, 2025 3:19PM
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్లను ఇవాళ, రేపు గుంటూరు పోలీసులు కస్టడీ తీసుకున్నారు. ‘ఒక యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే నిందితుడిని ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడనుంచి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్ వాహనాన్ని అనుసరిస్తూ, వారి కస్టడీలో ఉన్న నిందితుడిపై మాజీ ఎంపీ మాధవ్ దాడి చేశారు.
పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో గోరంట్ల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 10వ తేదీ నుండి గోరంట్ల మాధవ్తో పాటు మరో ఐదుగురు రిమాండ్లో ఉన్నారు. వీరందరికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించి.. గుంటూరు పోలీసులకు అప్పగించారు. తిరిగి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. నగరంపాలెం పోలీసు స్టేషన్కు పోలీసులు తీసుకుని వెళ్లనున్నారు. రెండు రోజుల కస్టడీ అనంతరం గురువారం సాయంత్రం గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుండి తిరిగి గురువారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు గుంటూరు పోలీసులు తరలించనున్నారు.