posted on Apr 11, 2025 11:53AM
హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ పై మరో కేసు నమోదైంది. మంత్రి నారా లోకేష్ పై గురువారం (ఏప్రిల్ 10) గోరంట్ల మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేశారు. జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారంటూ విమర్శలు చేసిన గోరంట్ల మాధవ్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అంతకు ముందే తెలుగుదేశం కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ ను గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకుని కిరణ్ పై దాడికి ప్రయత్నించిన గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో మరో కేసు నమోదైంది.