posted on Apr 17, 2025 6:41PM
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని న్యాయస్ధానం టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. అయితే, ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా.. పేపర్ లీక్ కారణంగా ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. దాంతో 2023 జూన్లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు.
దీనిపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కానీ, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పిటిషన్ను వెనక్కి తీసుకుంది. ఇదే సమయంలో పాత నోటిఫికేషన్ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ను ఫిబ్రవరి 19న విడుదల చేసింది.