posted on Apr 21, 2025 2:44PM
కేసీఆర్ నుంచి కేశినేని నాని వరకు
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఊహించని ప్రత్యర్థులు విషెస్ చెప్పడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ దగ్గర నుంచి ఏపీ మాజీ సీఎం జగన్ సహా పలువురు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. అటు తెలంగాణ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ సైతం చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు.. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు వచ్చాయని, హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. కేసీఆర్, షర్మిల కూడా సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలపడం విశేషం. పార్టీ నేతలు, మిత్రపక్షాలు, అభిమానులు సరేసరి.. వైరి వర్గాలు కూడా ఈసారి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలపడం ఆసక్తిగా మారింది.
మాజీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈసారి సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలపలేదు. కన్నతల్లి పుట్టినరోజుని పట్టించుకోని జగన్, తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆయన చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ వేశారు. ఆయన ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.
ఆ మధ్య స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం హైదరాబాద్ లో నిరసనలకు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పక్క రాష్ట్రం వ్యవహారాలు ఇక్కడెందుకంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అక్కసుని ప్రదర్శించారు. అయితే నేడు సీఎంగా ఉన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన సహజ వైఖరికి భిన్నంగా స్పందించడం విశేషం. ట్విట్టర్లో విషెస్ చెబుతూనే.. పార్టీ మీటింగ్ లో చంద్రబాబు గొప్పదనాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు చంద్రబాబు తీసుకొచ్చారని వివరించారు. అభివృద్ధి విషయంలో ఆయన ఆనవాళ్లు, ముద్రను ఎవరూ చెరిపేయలేరని చెప్పుకొచ్చారు. అటు కేసీఆర్ కూడా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని, ఆయన పాలనలో ఏపీ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు కేసీఆర్.
ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి పుట్టిన రోజు కావడంతో మిత్రపక్షాల నేతలంతా సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన వారంతా ఈ రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం.
ఇదంతా ఒక ఎత్తైతే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబును కీర్తిస్తూ విషెస్ చెప్పడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్టాపిక్గా మారింది. ఒకప్పుడు టీడీపీ తరఫున రెండు సార్లు విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని నాని పార్టీకి వీర విధేయుడిగా ఉండేవారు. కానీ సొంత పార్టీలో ప్రత్యర్దులను పెంచిపోషించుకుని, పార్టీలో ఇమడ లేక గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం వీడి వైసీపీలో చేరారు. అక్కడ ఎంపీ సీటు తెచ్చుకున్నా ఓడిపోయారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా సోషల్ మీడియాలో నాని యాక్టివ్ గానే ఉంటున్నారు. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబును ఉద్దేశించి కేశినేని నాని ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో చంద్రబాబుకు వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. అసలే టీడీపీలోకి కేశినేని నాని రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబుతో అనుబంధాన్ని నాని గుర్తుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మైలురాయి ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన, ప్రజా సేవను సూచిస్తుందని నాని పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట దశలో ఆ ప్రయాణంలో భాగం అయ్యే అవకాశం తనకు లభించిందన్నారు. ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు కూడా నాని తెలిపారు. మీకు మంచి ఆరోగ్యం, నిరంతర బలం, ప్రజా జీవితంలో, సేవలో మరిన్ని చురుకైన సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్తూ కేశినేని నాని తన పోస్టును ముగించారు.
గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అంతకు ముందు తాను కలిసి పనిచేసిన వ్యక్తులతో కేశినేని నాని తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారన్న ప్రచారం ఉంది. అదే క్రమంలో ఆయన్ను తిరిగి టీడీపీలోకి వచ్చేయాలంటూ ఆఫర్లు వస్తున్నాయంట. అయితే రాజకీయాల్లో రీఎంట్రీపై ఏ నిర్ణయం తీసుకోలేదంటూ కేశినేని నాని గతంలో పలు మార్లు చెప్పారు.