posted on Apr 10, 2025 10:53AM
ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపకా తప్పదన్నా అన్నట్లు జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగి.. ఎదురేలేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితుల్లో పడ్డారు. గతంలో చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్ధితిలో ఉన్నారు. అగ్రీగోల్డ్ భూ కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్టై బెయిలు మీద ఉన్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కూడా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేష్ కు సీఐడీ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ సారి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ కు నోటీసులు జారీ అయ్యాయి.
శుక్రవారం (ఏప్రిల్ 11) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు. జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురివింద గింజ సామెతలా.. తాను ఓ వైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ.. అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ అప్పట్లో అధికారం అండతో పాల్పడిన అక్రమాలకు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితుల్లో పడ్డారు.