posted on Apr 17, 2025 5:45PM
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక విధంగా జగన్ కి ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ ఝలక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో 793 కోట్ల రూపాయల విలువైన దాల్మిచా సిమెంట్స్ ఆస్తులను గురువారం (ఏప్రిల్ 17) అటాచ్ చేసింది. ఈ అటాచ్ చేసిన వాటిలో దాల్మిచా సిమెంట్స్ భూములు కూడా ఉన్నాయి. కడప జిల్లాలో 417 హెక్టార్ల భూమి కేటాయింపు విషయంలో దాల్మియాపై ఆరోపణలు ఉన్నాయి.
కడప జిల్లాలో దాల్మిచా సిమెంట్స్ కు సున్నపురాయి లీజు కేటాయింపుల వెనుక జగన్ ఉన్నారని సీబీఐ గతంలో చార్జిషీట్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జగన్ 150 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి పొందారని కూడా సీబీఐ ఆ చార్జి షీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ 150 కోట్ల రూపాయలలో 55 కోట్ల రూపాయలు హవాలా రూపంలోనూ, దాల్మియా సిమెంట్స్ లో షేర్ల రూపంలో 95 కోట్ల రూపాయలు జగన్ కు చేరాయని సీబీఐ చార్జి షీట్ లో పేర్కొంది. ఆ చార్జి షీట్ ఆధారంగానే ఈడీ విచారణ జరిపింది. తాజాగా దాల్మియా సిమ్మెంట్స్ ఆస్తులను అటాచ్ చేసింది.
వాస్తవానికి జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జి షీట్ దాఖలు చేసి పన్నెండేళ్లు దాటింది. ఇప్పటి వరకూ విచారణ నత్తనడకనే సాగుతోంది. దర్యాప్తు దారీ అలాగే ఉంది. అటువంటిది హఠాత్తుగా ఉరుములేని పిడుగులా దాల్మియా ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ పరిణామంతో జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు వేగం పుంజుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.