posted on Apr 23, 2025 10:19AM
విశాఖ ఐటీ హిల్స్ లో టీసీఎస్ కి ఎకరా 99 పైసలకే రైటా- రాంగా…?
బ్లూ ఇన్ ఫ్లూయెన్షర్లు చేస్తోన్న ఈ దుష్ప్రచారంలో నిజమెంత, అబద్ధమెంత?
విశాఖ ఐటీ హిల్ లో టీసీఎస్ కి ఎకరా 99 పైసలకే ఇవ్వడం కరెక్టేనని.. కళ్లు మూసుకుని చెప్పొచ్చు. కానీ కొందరూ వైపీపీయులు దీన్నో భూతద్దంలో పెట్టి చూపెడుతూ.. తప్పు పడుతున్నారు. ఇదే గత ప్రభుత్వాలు స్వామీజీలకు ఎకరా రూపాయకు ఇస్తుంటే లేని తప్పు.. ఇప్పుడు ఉద్యోగదాయిని అయిన ఐటీ రంగానికి సంబంధించి 99 పైసలకే భూమి ఇవ్వడం ఎందుకు తప్పు?
టీసీఎస్ ఏమైనా సమాన్యమైన సంస్థా.. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలోనే టాప్ త్రీలో ఒకటి. అలాంటి సంస్థను దగ్గరకు చేర్చుకోవడంలో భాగంగా వారికిలాంటి అవకాశం ఇవ్వడం సంజసమే. ఇలాంటి సంస్థలు రాష్ట్రానికి రావాలంటే ఆ మాత్రం త్యాగం అవసరమే అన్నది నిరుద్యోగుల వాదన. ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవడానికేగా ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకుంటున్నది? ఇదే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్న అమరా రాజా వంటి సంస్థలకు తెలంగాణాకు వెళ్లి పోయాయ్. అదే ఇప్పుడు ఆయా సంస్థలు ముందుకు వస్తున్నాయ్.
ఇప్పటికే ఏఐ హబ్ గా ఏపీని ఎంపిక చేసుకునే దిశగా.. బిల్ గేట్స్ తో బాబు చేస్తున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇలాంటి ఆకర్షణీయ పథకాలను ప్రవేశ పెడితేనే కదా.. రాష్ట్రం మున్ముందుకు వెళ్లేది? అన్న మాట వినిపిస్తోంది. బేసిగ్గా ఏపీ పెద్ద పెద్ద డాటా సెంటర్లు పెట్టడానికి తగిన వెసలు బాటు లేదన్న మాట ఐటీ రంగంలో వినిపిస్తూ ఉంటుంది. అది తప్పని నిరూపించాలంటే టీసీఎస్ వంటి సంస్థలు ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా వారికిలాంటి ఆకర్షణీయమైన పథకాలను ఇవ్వాల్సి ఉంటుంది.
సినిమా రంగానికి ఆనాడు హైదరాబాద్ లో భారీ ఎత్తున ఉచిత భూములను ఇవ్వడం వల్లే కదా సినీ పరిశ్రమ అక్కడ నుంచి వదిలి ఇక్కడికి రానంటోంది. వారు రావాలంటే ఇక్కడ కూడా తగిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తేనే కదా.. అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. ఇదే వైసీపీ ప్రభుత్వం హయాంలో కోలీవుడ్ కి ఏపీ సరిహద్దు ప్రాంతమైన తడ వంటి చోట్ల భూములు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరిగాయి. మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడే ఎందుకు లేస్తోంది. మదనపల్లెలోనూ ఎకరాల కొద్దీ స్టూడియోల నిర్మాణాలకు ఇచ్చేందుకు నాటి ప్రభుత్వం పావులు కదిపింది.
ఇదలా ఉంచండి.. భీమిలి సముద్ర తీర ప్రాంతాన్ని విజయసాయిరెడ్డి భారీ ఎత్తున విస్తరించి సామ్రాజ్య స్థాపన చేసే యత్నం చేశారు. ఏకంగా సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేయడానికి పెద్ద ఎత్తున పునాదులు వేశారు. ఆనాడు అధికారం తమ చేతుల్లో ఉందన్న కోణంలో ఆర్మీ తరహా బంకర్ల నిర్మాణం సైతం చేపట్టారు. జనసేన కార్పొరేటర్ మూర్తి ఇది గుర్తించడం వల్ల.. కేసులు వేయడం వల్ల.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వాటిని, కూటమి ప్రభుత్వం కూకటి వేళ్లతో సహా పెకలిస్తోంది. మరి ఇదే బ్లూ ఇన్ ఫ్లూయెన్షర్లు.. ఈ విషయాలను ఎందుకు గుర్తించరు.
మరో ఉదాహరణ తీసుకుందాం.. గత ప్రభుత్వ కాలంలో ఇటు తిరుమలలో కావచ్చు అటు బయట కావచ్చు కొందరు స్వామీజీలకు అప్పనంగా స్థలాలు, పొలాలు.. తమ సొంత ఆస్తిలా రాసిచ్చేశారు. మరి అప్పుడు ఇదే బ్లూ ఇన్ ఫ్లూయెన్షర్ల వాదన ఏమై పోయింది? వారికపుడు కళ్లు కనిపించలేదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇదంతా ప్రాజెక్టులకు గండి కొట్టే ఎత్తుగడ.. బ్రాహ్మడి చేతిలో మేక పిల్లను కుక్క పిల్లను చేసేలాంటి కుట్ర. వీటిని భగ్నం చేసి.. ఇలాంటి వారిపట్ల వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగానే ఐటీ సంస్థలను ఏదో ఒక ఆకర్షణీయ మంత్రం వేసి ఆకట్టుకోవల్సిందే. లేకుంటే తమ బతుకులు శాశ్వతంగా పొరుగురాష్ట్రాల పాలే అంటోంది నిరుద్యోగ యువత.