posted on Apr 16, 2025 4:33PM
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్న సంగతి విదితమే. ఆయన స్థానంలో తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బీఆర్ గవాయ్ పేరును కొలీజియం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే నెల అంటే మే 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన దాదాపు ఆరు నెలల పాటు సీజేఐగా సేవలందించనున్నారు. ఈ ఏడాది నవంబర్ లో గవాయ్ పదవీ విరమణ చేస్తారు.
బీఆర్.గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1985లో న్యాయవాదిగా బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో ప్రాక్టీస్ చేశారు. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రాసిక్యూటర్గా పని చేశారు. ఇక నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.
కేంద్ర న్యాయశాఖ సూచనల మేరకు గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. మే 14, 2025 నుంచి నవంబర్ 24, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ పని చేయనున్నారు.