posted on Apr 23, 2025 12:25PM
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ బేగంపేటలోని ఆయన నివాసంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. ఆ సమయంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై పెట్టిన కేసు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికి ముంబైకు చెందిన నటి కాదంబరి జత్వానీపై కేసు బనాయించి, అక్రమంగా ముంబై నుంచి విజయవాడకు తీసుకు వచ్చి నిర్బంధించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ మేరకు నటి జత్వానీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అప్పుడు విజయవాడ సీపీగా ఉన్న కాంతిరాణాతాతా, డీసీపీగా ఉన్న విశాల్ గున్నీపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇప్పుడు ఆ కేసులోనే పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో పీఎస్సార్ ఆంజనేయులును దాదాపు ఏడుగంటల పాటు విచారించిన అనంతరం ఆయనకు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు మే 7 వరకూ రిమాండ్ విధించింది.