posted on Apr 17, 2025 8:22PM
హైదరాబాద్ పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పుప్పాలగూడ భూముల్లో ఐటీ హబ్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సమావేశమైన మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సంబంధిత అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితర సొసైటీలకు సుమారు 200 ఎకరాలకు పైచిలుకు భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించింది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, రెవెన్యూ, స్పెషల్ పోలీస్ సొసైటీలకు కేటాయించిన ఈ భూమిలో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘వివిధ సొసైటీలకు 200 ఎకరాల భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పక్కనే ఉన్న మరో 250 ఎకరాల టీజీఐఐసీ భూములు కలిపి ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం. ఈ ఐటీ నాలెడ్జ్ హబ్తో 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు