‘పుష్ప2’ కోసం 10 రోజులు కష్టపడి మూడు వెర్షన్లు ఇచ్చాడు.. చివరికి ఏమైంది?

‘ఆర్య’తో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్‌ ఈ 20 సంవత్సరాల్లో 9 సినిమాలు డైరెక్ట్‌ చేశారు. అన్ని సినిమాలకూ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాదే. అతన్ని దాటి ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దగ్గరకీ సుకుమార్‌ వెళ్ళలేదు. కానీ, అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప2’ చిత్రం మ్యూజిక్‌కి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో, సోషల్‌ మీడియాలో వచ్చాయి. దేవిశ్రీప్రసాద్‌ ‘పుష్ప2’ నుంచి తప్పుకున్నాడని, అతని స్థానంలో థమన్‌ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌ మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన కారణంగానే థమన్‌ని తీసుకున్నారని కొందరు చెప్పుకోగా, దేవి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల అనుకున్న టైమ్‌కి వర్క్‌ పూర్తి కావడం లేదనే కారణంతో థమన్‌ని రంగంలోకి దింపారని ప్రచారం జరిగింది. ఒక సందర్భంలో ‘పుష్ప2’ చిత్రం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం తాను వర్క్‌ చేస్తున్నానని థమన్‌ స్వయంగా ప్రకటించుకున్నారు. సినిమా రిలీజ్‌ అయ్యే వరకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ థమనే చేశాడని అందరూ అనుకున్నారు. కానీ, టైటిల్స్‌లో అతని పేరు కనిపించకపోవడంతో అందరూ షాక్‌ అయ్యారు. 

దీనికి సంబంధించి థమన్‌ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘పుష్ప2’ కోసం తాను 10 రోజులు పని చేశానని, సుకుమార్‌ టేస్ట్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసి మూడు వెర్షన్లుగా ఇచ్చానని అన్నారు. తను చేసిన మ్యూజిక్‌ యూనిట్‌లోని అందరికీ నచ్చిందని చెప్పారట. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ ఫైనల్‌గా దేవిశ్రీప్రసాద్‌, సామ్‌ సి.ఎస్‌. చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని ఓకే చేశారు. అది తనకు బాధ కలిగించలేదని చెప్పుకొచ్చారు థమన్‌. తుది నిర్ణయం డైరెక్టర్‌దే కాబట్టి దాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. ఇటీవల వచ్చిన చాలా సినిమాలకు థమన్‌ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశారు. ‘పుష్ప2’ కోసం మూడు వెర్షన్లు చేసినా సుకుమార్‌కి నచ్చలేదు. అయితే సుకుమార్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేనని సినిమా చూసిన వారికి అర్థమవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఎన్నో సీన్స్‌ని బాగా ఎలివేట్‌ చెయ్యడానికి మ్యూజిక్‌ బాగా హెల్ప్‌ అయింది. ఏది ఏమైనా 130 సినిమాలకు సంగీతం అందించిన థమన్‌ని ‘పుష్ప2’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చెయ్యమని అడగడం, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టడం అనేది ఒక టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌కి జరిగిన అవమానంగానే భావించాలి.



Source link