posted on Apr 11, 2025 11:14AM
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నంలో విమానయానానికి పూర్వ వైభవం వస్తుందని అనుకుంటున్న తరుణంలో విశాఖ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సింది పోయి.. ఉన్న సర్వీసులే రద్దౌతున్నాయి. పేరుగొప్ప ఊరు దిబ్బ లా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పరిస్థితి మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు రెండు సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా.. వచ్చే నెల నుంచి అంటే మే నుంచి బ్యాంకాక్ , కౌలాలంపూర్ సర్వీసులూ రద్దు కానున్నాయి. ఇప్పటికే వాటి బుక్కింగులను నిలిచిపోయాయి. గతంలో అంటే కొవిడ్ సమయంలో నిలిచిపోయిన దుబాయి విమాన సర్వీసు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఉన్నవి కూడా రద్దు అవ్వడంపై పారిశ్రామికవేత్తలు, నాయకులు, వి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా ఉత్తరప్రదేశ్ కు చెందిన రామ్మోహన్నాయుడు దీనిపై దృష్టి పెట్టి రద్దైన సర్వీసులను పునరుద్ధరించడం, కొత్త సర్వీసుల ప్రారంభంపై దృష్టి సారించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
విశాఖ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్లకు నేరుగా విమాన సర్వీసులు గతేడాది ఏప్రిల్లో ప్రారంభమయ్యాయి. వారంలో మూడేసి రోజులు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కంబోడియా, చైనా, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్, లావోస్, మకావ్, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లేవారికి వీటి వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న కారణంగా జనవరిలో కౌలాలంపూర్ సర్వీసును నిలిపివేయాలని ఆ సంస్థ భావించగా.. కేంద్ర మంత్రి చొరవతో సేవలు కొనసాగించారు.
గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 74.4 శాతం పెరిగింది. 8,415 మంది మలేసియా, కౌలాలంపూర్, సింగపూర్కు రాకపోకలు సాగించారు. తాజాగా మే మొదటి వారం నుంచి ఈ సర్వీసులకు టికెట్ల బుకింగ్ నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి విశాఖతోపాటు తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్, చెన్నై వెళ్లి.. అక్కడి నుంచి బ్యాంకాక్, మలేసియాలకు ప్రయాణించాలి.
విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన నేపథ్యంలో గతేడాది అక్టోబరులో రెండు కొత్త సర్వీసులు ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఉదయం రెండు, సాయంత్రం ఒక సర్వీసు అందుబాటులో ఉండేవి. తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. మిగిలిన రోజుల్లో విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వందే భారత్ రైలు అందుబాటులో ఉంది. మంగళవారాల్లో వందేభారత్ కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణీకులు గగ్గోలు పెడుతున్నారు.