ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే మంత్రం.. మల్లీప్లెక్స్ లలో మద్యం? | liquor in theators to attract audience| pvr| inax| request| karnataka

posted on Apr 10, 2025 6:31AM

ఓటీటీలు వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అన్నది బాగా తగ్గిపోయింది.   ఒకప్పుడు సినిమా తప్ప వినోదానికి మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఇప్పుడు ఓటీటీ, మొబైల్స్‌ వంటివి థియేటర్ల ప్రాధాన్యాన్ని చాలా వరకూ తగ్గించేశాయి. ఒకప్పుడు కొత్త సినిమా విడుదల కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్త సినిమా విడుదలైనా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారన్న గ్యారంటీ లేదని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.   రోజురోజుకీ థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతోంది. ఇందుకు కారణం ఓటీటీ.  ప్రతి సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తుండటంతో  ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా వరకూ తగ్గిపోయింది. దీంతో ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలిన థియేటర్లకు కూడా అదే గతి పట్టే అవకాశం ఉంది. అందుకే పివిఆర్‌ సంస్థ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు ఓ కొత్త ఆలోచన చేస్తోంది. మల్టీప్లెక్స్‌లలో మద్యం అమ్మకాలు  చేయాలనేది ఆ ఆలోచన. మద్యం సేవించి థియేటర్లలోకి ప్రవేశించకూడదు అనే నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని సడలించాలని, షాపింగ్‌ మాల్స్‌లో మాదిరిగానే థియేటర్స్‌లో కూడా మద్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని పివిఆర్‌ భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరు, గుర్గావ్‌ వంటి నగరాల్లో ఈ సంస్థ.. మద్యం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని ప్రభుత్వం ఆమోదిస్తే కొన్నిఎంపిక చేసిన థియేటర్లలో మద్యం అమ్మకాలు సాగించవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. 

విదేశాల్లోని లగ్జరీ థియేటర్స్‌లో ఈ సదుపాయం ఉంది.   ఇక్కడ కూడా అది అమలు అయితే థియేటర్లకు ప్రేక్షకులు తరలి వస్తారని మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఆశిస్తున్నాయి.  తద్వారా థియేటర్లకు ఆదాయం పెరుగుతుంది. దానితోపాటే ప్రభుత్వానికి కూడా ఆదాయం  ఉంటుంది. అలాగే సినిమాలు నిర్మించే నిర్మాతలకు కూడా ప్రోత్సాహంగా ఉంటుందని పివిఆర్‌ భావిస్తోంది. మరి ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.



Source link