posted on Apr 19, 2025 6:00PM
విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం
అనుకున్నట్టే జరిగింది… విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం అయింది. మాజీ మంత్రులు బొత్ససత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఎత్తులు చిత్తయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో అమాయకపు బీసీ మహిళ బలయ్యారు. సొంత పార్టీ కార్పొరేటర్లే ఎదురుగా తిరగడంతో ఆ పార్టీ పరువు మరోసారి గంగలో కలిసింది.
విశాఖ మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం శనివారం జరిగింది. పూర్తి భద్రత ఏర్పాట్ల మధ్య గుర్తింపు అనంతరం కార్పొరేటర్ లను అనుమతించారు ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత విశాఖ కార్పొరేషన్ లో కార్పొరేటర్ల పార్టీ బలాబలాలు మారాయి. నాలుగేళ్ల క్రితం మేయర్ పదవి దక్కించుకున్నప్పుడు వైసిపి బలం 58 కాగా ఇప్పుడు మారిపోయింది జనసేన బలం 11 కి చేరింది ఈ దశలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం ద్వారా కూటమి పార్టీలు మేయర్ పదవిని దక్కించుకుంటాయని ముందుగానే అందరూ అంచనాలు వేశారు. కానీ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ రాజకీయ ఎత్తులు వేశారు. ముందుగా శిబిర్యాలను ఏర్పాటు చేసి కార్పొరేటర్ లను శ్రీలంక తరలించారు. కానీ కరుడుగట్టిన వైసిపి కార్పొరేటర్లుగా పేరుందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల వంశీ బెహరా భాస్కరరావు, అవంతి శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక తదితరులు అవిశ్వాసానికి ముందే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కూటమి చేతుల్లోకి విశాఖ కార్పొరేషన్ రావడం ఖాయమని అందరికీ అర్థమైంది. కానీ విప్ జారీ చేయడం ద్వారా అవిశ్వాసానికి తమ కార్పొరేటర్లు దూరంగా ఉంటారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. మరోవైపు విప్ పాటించినట్లయితే అనర్హత వేటు వేస్తామని మరో మంత్రి బొత్స సత్యనారాయణ బెదిరింపులు, హెచ్చరికలకు దిగారు. అయితే వీరి హెచ్చరికలను భయపడే స్థాయి నుంచి వైసీపీ తిరుగుబాటు కార్పొరేటర్లు ఎప్పుడో ఎదిగిపోయారు.
అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని పార్టీ పనులు అన్నీ కూడా ఓ కోటరీ చుట్టూ తిరిగాయనీ, తిరుగుబాటు కార్పొరేటర్లు బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ దశలో అవిశ్వాస తీర్మా నానికి అనుకూలంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది కూటమి. కూటమికి చెందిన 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు తో పాటు 63 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇందులో ప్రధానంగా తిప్పల వంశీ ముత్తం శెట్టి ప్రియాంక బెహరా తదితరులు ఉన్నారు. ఒకరకంగా కూటమి పరువును వైసీపీ తిరుగుబాటు కార్పొరేటర్లు దక్కించినట్లు అయింది. ఏడాది కాలంలో ఎప్పుడు కార్పొరేషన్ వైపు రాని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు కూడా కౌన్సిల్ కు హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా చెయ్యి ఎత్తారు.
అదలా ఉంటే.. నాలుగేళ్లపాటు మేయర్ గా కొనసాగిన గొలగాని హరి వెంకట కుమారి అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు. తొలి నుంచీ సౌమ్యంగా ఉండే ఆమె పట్ల ఏ పార్టీకీ వ్యతిరేకత లేదు కానీ.. ఒక్కటయ్యారు. దాదాపు మూడు నెలలుగా అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ పదవి పోతుందని ఊహాగానాలు వినిపించాయి. ఆ దశలో గొలగాని హరి వెంకట కుమారి పదవికి రాజీనామా చేసి ఉంటే గౌరవంగా ఉండేది. కానీ వైసీపీ నాయకులు కులం కార్డు కూడా వినియోగించారు. బీసీ మహిళ అంటూ నినదించారు. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రధానంగా మాజీ మంత్రులు బొత్స సత్యనారా యణ, గుడివాడ అమర్నాథ్ కారణంగానే గోల గాని హరి వెంకట కుమారి ప్రతిష్టకు భంగం కలిగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆమె రాజీనామా చేసినట్లయితే ఆమెతో పాటు పార్టీకి గౌరవం దక్కి ఉండేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైనా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు విశాఖ మేయర్ పదవిని బలి ఇచ్చారని విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
.
విశాఖ మేయర్ పదవిని చెప్పినట్లే తప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు డిప్యూటీ మేయర్ లపై దృష్టి పెట్టారు. అయితే ఇద్దరు డిప్యూటీ మేయర్లలో ముందుగా శ్రీధర్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో.. మరికొన్ని రోజుల్లోనే ఆయన నాలుగేళ్ల పదవి కాలం ముగుస్తోంది. దీంతో ఇప్పటికే ఆ అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ కు కూటమి నాయకులు నోటీసు ఇచ్చారు. ఈ దశలో డిప్యూటీ మేయర్ శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను చక్రం తిప్పారని చాలా విమర్శలు ఉన్నాయి. మేయర్ ను ఒక బొమ్మగా చూపించి దోచుకున్నారని. అందుకే ఆ నాయకులను టార్గెట్ చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటికే జియాని శ్రీధర్ ఆస్తుల వివరాలపై ఒక వీడియోను కూడా కూటమి నాయకులు విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన బాణాల శ్రీను, జియ్యాని శ్రీధర్, మోల్లి లక్ష్మి అప్పారావు, పారిశ్రామిక వాడకు చెందిన సురేష్ తదితరుల పై ఇప్పుడు కూటమి టార్గెట్ పెట్టింది. త్వరలోనే డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
అదలా ఉంటే.. పెందుర్తి ప్రాంత కార్పొరేటర్ టిడిపి సీనియర్ నాయకుడు పీలా శ్రీనివాస్ ఇక విశాఖ నగర మేయర్ అయినట్టే. కూటమి కార్పొరేటర్ల శిబిరాల ఏర్పాటు.. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్ల ఫిరాయింపు వ్యవహారంలో అన్ని రకాల వ్యవహారాలను పీలా శ్రీనివాస్ తన భుజంపై వేసుకున్నారు. కేవలం 10 నెలల కాలపరిమితి ఉన్న ఈ మేయర్ పీఠం కోసం ఎందుకని చాలామంది కూటమి నాయకులు వెనుకడుగు వేసినా.. పీలా కుటుంబం వైసీపీ హయాంలో తమకు జరిగిన నష్టాన్ని ఈ రకంగా తీర్చుకో వాలని నిర్ణయించారు. పీల శ్రీనివాస్ సోదరుడు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే ఆస్తులను వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ధ్వంసం చేసిన ఘటనలను కూటమి నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సీతంపేటలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ భవనాన్ని కూల్చివేయడం ఆనందపురం మండలం రామవరం వద్ద వారి కుటుంబానికి చెందిన భూములను తీసుకోవడానికి వైసిపి హయాంలో జరిగిన వ్యవహారాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ దశలో త్వరలో జరిగే సమావేశం ద్వారా కూటమి నాయకులు పీలా శ్రీనివాస్ ను మేయర్ గా ఎన్నుకునే అవకాశాలు దాదాపు ఖరారు అయినట్టే.
అయితే విశాఖలో వైసీపీ పరువు పోవడానికి బోత్స, గుడివాడల అనవసర రాజకీయాలే కారణమని వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఇక్కడ కూడా అదే రకంగా గొలగాని హరి వెంకట కుమారి రాజీనామా చేసినట్లయితే పార్టీ పరువు నిలిచి ఉండేది. కానీ బొత్స గుడివాడ అనాలోచిత నిర్ణయాల వలన పార్టీ పరువు బజారు పాలు అయిందని వైపీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.