బొత్స బెదిరింపులకు కార్పొరేటర్లు భయపడేనా ?

posted on Apr 18, 2025 12:35PM

విశాఖలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పై చర్చ రేపే

ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి అంటారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే  తయారైంది.  నిన్న మొన్నటి వరకూ  నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.  రాజ్యసభ సభ్యత్వం నుంచి సర్పంచి వరకు వైసీపీ నాయకులు  రాజీనామాలు చేసి కూటమి పార్టీల బాట పడుతున్నారు.  ఈ తరుణంలో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం అగ్నిపరీక్షగా మారింది. ఆ పార్టీకి కంటే..   ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకి విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకోవడం కీలకంగా మారింది. .

.విశాఖ కార్పొరేషన్ లో 98 వార్డులకు గాను 58 వార్డులో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు.  కానీ అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో ఇతర పార్టీలు ఇండిపెండెంట్ లను కూడా వైసీపీ బెదరించి తమలో కలుపుకుంది.  అయతే రాష్ట్రంలో  వైసీపీ అధికారం కోల్పోవడంతో విశాఖ మేయర్ పీఠం పై కూటమి నాయకులు కన్ను వేశారు.  దీనికి వైసీపీలోని అసంతృప్తి వర్గం పూర్తిస్థాయిలో సహకరించింది.  దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తెలుగుదేశం, జనసేన గూటికి చేరిపోయారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 74. అయితే ఇప్పడు కరుడుగట్టిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు కూడా ఫ్యాన్ పార్టీని వీడారు. తిప్పల వంశీ,  బెహరా భాస్కరరావు… ముత్తం శెట్టి ప్రియాంక లాంటి నాయకులు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు

ఈ దశలో తమ పార్టీ సింబల్ పై గెలుపొందిన 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చర్చకు హాజరు కాకూడదని ఆ పార్టీ నాయకులు  బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ హుకుం జారీ చేశారు. అలాగే పార్టీ విప్ ను కూడా జారీ చేస్తున్నట్టు ప్రకటించారు.  పార్టీ ఆదేశాన్ని పాటించని వారిపై అనర్హత వేటు వేస్తామని కూడా బొత్స సత్యనారాయణ తాజాగా హెచ్చరించారు.  నిజానికి విశాఖ తాజా కార్పొరేషన్ కాలపరిమితి కేవలం పది నెలలు మాత్రమే ఉంది. ఈ దశలో న్యాయం పరమైన చిక్కులు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.  దీంతో పార్టీ మారిన ఫ్యాన్ పార్టీ నాయకులు ఎవరూ కూడా బొత్స మాటలను లెక్కచేసే అవకాశం లేదు.  అన్నిటికంటే మించి కార్పొరేటర్లగా గెలిచినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న ఆగ్రహం చాలామంది వైసీపీ కార్పొరేటర్ లలో ఉంది.  ముఖ్యంగా ఒక కోటరీ చుట్టూ కార్పొరేషన్ వ్యవహారం సాగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ఇక బొత్స సత్యనారాయణ విశాఖ మేయర్ విషయంలో బీసీ కార్డును ఉపయోగించుకోవాలని భావించారు. అవిశ్వాసం ద్వారా బీసీ మహిళను అగౌరవ పరుస్తున్నారని బొత్స సత్యనారాయణ తాజాగా ఆరోపించారు. దీనికి కూటమి కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. అసలు పేరుకు మేయర్ అయినప్పటికీ ఆమెను ఆ పార్టీ ఎప్పుడూ కూడా గౌరవించలేదని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి,  వై వి సుబ్బారెడ్డి లాంటి నాయకుల పెద్దరికం మాత్రమే కనిపించిందని గుర్తు చేశారు. ఈ దశలో విశాఖ మేయర్ భవిష్యత్తుతో పాటు బొత్స సత్యనారాయణ పెద్దరికానికి ఈ అవిశ్వాస తీర్మానం అగ్నిపరీక్ష కానుంది.



Source link