posted on Apr 23, 2025 9:36AM
జమ్మూ కశ్మీర్ పై ఉగ్రవాదం మరో మారు పంజా విసిరింది. పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్ర మూకలు మరో మారు తెగబడ్డాయి.అనంత్నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం 27 మంది టూరిస్టులు మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిని హెలికాప్టర్ ద్వారా పహల్గాం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ కాల్పులకు తామే బాధ్యులమని పాకిస్థాన్ టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తొయిబాకు అనుబంధంగా ఉన్న స్థానిక సంస్థ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది.
దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి స్థావరంగా మారిన జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని నిర్వీర్యం చేసిన నేపథ్యంలో క్రమక్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. మరోవంక పరిపాలనా పరమైన మార్పులలో భాగంగా జమ్మూకశ్మీర్ రాష్ట్రం, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.ఆ తర్వాత కశ్మీరీ పండిట్లు క్రమంగా తమ స్వస్థలాలకు రావడం ప్రారంభించారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తై.. మళ్లీ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటై, ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడితో మరోమారు కలకలం రేగుతోంది.
కాగా పహల్గాం ఉగ్రదాడి విషాదాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తీవ్రంగా ఖంచారు. అమెరికా, రష్యా సహా పలు దేశాలు పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండిచారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో భారత దేశానికి అండగా నిలుస్తామని ప్రకటించారు.
పహల్గాం ఉగ్రదాడి దిగ్ర్భాంతికరం. ఇదొక క్రూరమైన, అమానవీయ చర్య. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం. ఇది క్షమించరానిది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. అత్యంత హేయమైన ఉగ్రదాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందుకు తీసుకొస్తామనీ, వారిని వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేశారు.
ఉగ్రమూకల దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని, ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం మరింతగా బలపడుతుందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనకు సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని.. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పర్యటనను కుదించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు.
అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వానికి మచ్చ అనీ, ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ఇక నైనా ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ డొల్ల ప్రకటనలను కట్టిపెట్టి.. బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి వార్త కలచివేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతుగా నిలుస్తామని ట్రంప్తో పాటు ఇజ్రాయెల్, అర్జెంటినా దేశాలు కూడా తెలిపాయి.
పహల్గాం ఉగ్రదాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు. ఇలాంటి దొంగదెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రదాడి పాశవిక చర్య అని, దోషులను వదలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి తెలిపారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, దాడికి పాల్పడినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపడం అమానవీయ చర్య అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కె.లక్ష్మణ్, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్రావు ఉగ్రదాడిని ఖండించారు.