మూడో షెడ్యూల్‌లో SSMB29.. కొత్త అనుమానాలకు తావిస్తున్న రాజమౌళి!

2001లో ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన ఎస్‌.ఎస్‌.రాజమౌళి 2022లో విడుదలైన ‘RRR’ వరకు కేవలం 12 సినిమాలు మాత్రమే చేయగలిగాడు. ఏవరేజ్‌గా రెండు సంవత్సరాలకు ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. వీటిలో ‘బాహుబలి’ సిరీస్‌కి దాదాపుగా ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నాడు. తను అనుకున్న విధంగా వచ్చే వరకు ప్రతి సీన్‌ని చెక్కుతూనే ఉంటాడని రాజమౌళికి పేరు ఉంది. ఆ విషయాన్ని హీరోలే బహిరంగంగా చెబుతుంటారు. RRR చిత్రం కూడా అలాగే ఆలస్యమైంది. అంటే 2013 నుంచి 2022 వరకు అంటే 9 సంవత్సరాల్లో రాజమౌళి… బాహుబలి1, బాహుబలి2, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు మాత్రమే చేయగలిగారు. ఏవరేజ్‌గా ఒక్కో సినిమాకి మూడు సంవత్సరాల సమయం పట్టిందనుకోవచ్చు. బాహుబలి సిరీస్‌, RRR చిత్రాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. దీంతో అతను చేయబోయే తదుపరి సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ సూపర్‌స్టార్‌ మహేష్‌తో ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఎడ్వంచరస్‌ మూవీని ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. 

మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఎనౌన్స్‌ చేసిన తర్వాత చాలా కాలానికి షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం వివిధ భాషల నుంచి ఆర్టిస్టులను ఎంపిక చేశారని, అలాగే హాలీవుడ్‌ నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా తన ప్రతి సినిమా ప్రారంభానికి ముందు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సినిమాకి సంబంధించిన కథను క్లుప్తంగా చెప్తారు రాజమౌళి. తను చేయబోయే సినిమా కథను పూర్తిగా రివీల్‌ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న SSMB29కి సంబంధించి ఎలాంటి ప్రెస్‌ మీట్‌ లేకుండా, ఎనౌన్స్‌మెంట్‌ కూడా లేకుండా సైలెంట్‌గా షూటింగ్‌ స్టార్ట్‌ చేసేశారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేశారని కూడా తెలుస్తోంది. అందర్నీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే.. మూడో షెడ్యూల్‌ కూడా మొదలైపోయిందట. 

ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన ఇండియానా జోన్స్‌ సిరీస్‌ తరహాలో ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ ఉండబోతోందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ గతంలోనే చెప్పారు. అంటే ఆ స్థాయిలో సినిమా ఉండాలంటే ఎంతో గ్రౌండ్‌ వర్క్‌ చెయ్యాల్సి ఉంటుంది, ఎన్నో సెట్స్‌ నిర్మించాల్సి ఉంటుంది. సహజంగానే షూటింగ్‌ చాలా ఆలస్యమవుతుంది. అందులోనూ తెలుగులో రూపొందుతున్న పాన్‌ వరల్డ్‌ మూవీ కావడం వల్ల అన్ని విషయాల్లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ రాజమౌళి ఇన్‌వాల్వ్‌ అవుతాడన్న విషయం అందరికీ తెలసిందే. మరి ఈ సినిమా విషయంలో ఇంత దూకుడుగా వ్యవహరిస్తూ షూటింగ్‌ను పరిగెత్తించడం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. ఎందుకంటే ఒక చిన్న షాట్‌ పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం కొన్ని రోజుల పాటు షూటింగ్‌ జరిపి, ఆర్టిస్టులను ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, ఈ సినిమా విషయంలో రాజమౌళి ఆ జాగ్రత్తలన్నీ పక్కన పెట్టారేమో అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల ప్రారంభమైన మూడో షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎనౌన్స్‌ చేసిన తర్వాత షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వడానికి చాలా కాలం పట్టింది. దానికి కారణం.. మహేష్‌ లుక్‌ త్వరగా సెట్‌ కాకపోవడం, సినిమా షూట్‌ చెయ్యాల్సిన లొకేషన్ల ఎంపిక విషయంలో ఆలస్యం జరగడం వంటి కారణాల వల్ల షూటింగ్‌ లేట్‌గా స్టార్ట్‌ అయింది. ఇప్పుడు దాన్ని కవర్‌ చేసేందుకు రాజమౌళి తన చాదస్తాన్ని పక్కన పెట్టి స్పీడ్‌గా వర్క్‌ చేస్తున్నాడు అనిపిస్తోంది. సినిమాను త్వరగా పూర్తి చేయడం ఎంతో అవసరం. అదే సమయంలో క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడకుండా తన గత సినిమాల పద్ధతిలోనే చేస్తే మహేష్‌ సినిమా కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. అలా కాకుండా సినిమాను త్వరగా ఫినిష్‌ చెయ్యాలని స్పీడ్‌ పెంచితే అది సినిమా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాజమౌళి చేసిన పాన్‌ ఇండియా సినిమాల్లో త్వరగా షెడ్యూల్స్‌ పూర్తి చేస్తున్న సినిమా మహేష్‌దే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. 



Source link