posted on Apr 22, 2025 2:45PM
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ – 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దూబే అనే అభ్యర్థికి మొదటి ర్యాంకు వచ్చింది. తెలుగు అభ్యర్థి సాయి శివాణికి 11వ ర్యాంక్ వచ్చింది. మెయిన్స్లో ఉత్తీర్ణులైన 2,845 మందిని ఇంటర్వ్యూ చేసిన యూపీఎస్సీ ఇవాళ తుది ఫలితాలను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ.. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమినరీ పరీక్ష 42,560 మంది రాశారు. వారిలో సుమారు 500 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. వారిలో నుంచి 100 మంది వరకు ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు.