posted on Apr 21, 2025 6:20PM
బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇక పెరిగిన పసిడి ధరను చూసి సామాన్యులు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పట్లో తాము పసిడి కొనుగోలు చేయడం ఇక కలే అని వాపోతున్నారు. శుభకార్యాల సీజన్ ముందుండటంతో అసలు ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా-చైనా సుంకాల యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,469గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,599గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,475గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,605గా నమోదైంది.దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,613గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,743గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,465 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 97,595గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,461గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,591గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 89,455గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,585గాను ఉంది.