posted on Apr 12, 2025 6:29AM
బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరణపై తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తీరు రాష్ట్రంలో బీఆర్ఎస్ సభలు, సమావేశాలూ నిర్వహించకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. విషయమేంటంటే.. బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి పాతికేళ్లు అయిన సందర్భంగా ఆ పార్టీ వరంగల్ జిల్లా, ఎల్కతుర్తిలో పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవం, వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం సభ ఏర్పాట్లు, ర్యాలీలు తదితర అంశాలకు సంబంధించి అనుమతి కోసం పోలీసులను కోరింది. అయితే సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ తెలంగాణ కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 11) విచారించింది. ఆ సందర్భంగా పోలీసుల తీరును తప్పుపట్టింది.
ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభలూ, సమావేశాలూ నిర్వహించుకునే హక్కు, స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. రాజ్యాంగ బద్ధంగా అభించిన హక్కును అడ్డుకోవడం తగదని పేర్కొంది. కాగా సభకు అనుమతించే విషయంలో తమకు ఈ నెల 21 వరకూ గడువు ఇస్తే వాదనలు వినిపిస్తామంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై తెలంగాణ కోర్టు తీవ్రంగా స్పందించింది. బీఆర్ఎస్ 27న సభ నిర్వహించుకోవాలని కోరితే.. మీరేమో 21వ తేదీ వరకు గడువు కోరడం చేస్తుంటే.. వారికి సభ నిర్విహించుకునే అవకాశం లేకుండా చేయాన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.