posted on Apr 13, 2025 7:01AM
సింప్లిసిటీకి నిదర్శనంగా నిలుస్తున్నారు ఢిల్లీ సీఎం రేఖాగుప్తా. తాను చేయాలనుకున్నది, చెప్పాలనుకున్నది ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం (ఏప్రిల్ 14) ఆమె వెళ్తున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవుకు ఆహారం విసిరేయడాన్ని చూశారు. దీంతో వెంటనే కాన్వాయ్ ఆపి స్వయంగా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రినని పరిచయం చేసుకున్న రేఖాగుప్తా మరో సారి అలా చేయొద్దని చేతులు జోడించి రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి చర్యల వల్ల మూగజీవాలతో పాటు వాహనదారులకూ ప్రమాదమేనన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఢిల్లీ వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి కారులో నుంచి ఆవుకు రొట్టె ముక్క విసరడం ఆమె చూశారు. వెంటనే కారు ఆపి ఆయన వద్దకు వెళ్లి, రోడ్లపైకి ఆహారాన్ని విసిరేయడం వల్ల వాటిని తినేందుకు ఆవులు, ఇతర జంతువులు అక్కడకు వస్తాయని, అప్పుడు మూగజీవాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనదారులూ, రోడ్లపై నడిచే వారికీ ప్రమాదమేనని, అంతేకాదు.. ఆహారాన్ని ఇలా అగౌరవ పరచకూడదని సూచించారు. జంతువులకు ఆహారం పెట్టాలనుకుంటే, గోశాలల వంటి ప్రాంతాలకు వెళ్లాలని, రోడ్లపై ఆహారాన్ని విసరొద్దని, మూగజీవులను ప్రేమించాలనీ చెప్పారు. మన సంస్కృతిని గౌరవించండి రహదారి భద్రతను పాటించండని సీఎం రేఖా గుప్తా తన ట్వీట్లో ఢిల్లీ వాసులందర్నీ కోరారు. ఢిల్లీలోని హైదర్పుర్ ఫ్లైఓవర్పై శనివారం ఈ ఘటన జరిగింది.