posted on Apr 22, 2025 1:35PM
జగన్ కు అత్యంత విశ్వసనీయ సహచరుడు, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ తో కలిసి నడిచి, ఆఖరికి ఆయన అక్రమాస్తుల కేసులో కూడా సహనిందితుడిగా జైలు జీవితం కూడా అనుభవించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు. వైఎస్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం, ఆ కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటూ వచ్చిన ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ హయాంలో కుంభకోణాల గుట్టుమట్లన్నీ విప్పుతానంటున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాభవం తరువాత.. ఇంకా పార్టీకి ఏమైనా మిగిలి ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠనూ కూడా దిగజారుస్తానంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరినీ బయటకు లాగుతానని చెబుతున్నారు.
రాజ్ కసిరెడ్డి అరెస్టు అనంతరం సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి ఈ కుంభకోణంలో తనను తాను ఒక విజిల్ బ్లోయర్ గా అభివర్ణించుకున్నారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ పాత్రేనని చెప్పుకున్నారు. అయితే ఈ కుంభకోణంలో దొరికిన దొంగలు, ఇంకా దొరకకుండా ఉన్న దొంగలూ కూడా తమను తాము కాపాడుకోవడానికి తన పేరు లాగుతున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఇంకా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న దొంగల గుట్టుమట్లన్నీ తాను బయటపెడతానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిన్న మొన్నటి వరకూ జగన్ తోనూ, ఆ అధినేతగా ఉన్న వైసీపీతోనూ అంటకాగి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఒక్క సారిగా యూటర్న్ తీసుకుని అందరి బాగోతం బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేయడం వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తోందనడంలో సందేహం లేదు.
అందుకే రాజ్ కసిరెడ్డి అరెస్టు అయిన వెంటనే.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారల కమిటీతో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విషయమేంటంటే.. విజయసాయి రెడ్డి సిట్ దర్యాప్తులో పాల్గొన్న రెండు రోజుల వ్యవధిలోనూ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారణకు పిలిచింది. ప్రశ్నలు సంధించింది. దీంతో విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే మిథున్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే రాజ్ కసిరెడ్డే మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ అని విజయసాయి మీడియా ముఖంగా చెప్పిన తరువాతే ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ప్రమేయం గురించి అందరికీ తెలిసింది. కాగా విజయసాయి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పిన వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి చరిత్రను తానూ బయటపెడతానంటూ ఓ వీడియో విడుదల చేశారు.
దీంతో విజయసాయి రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి మద్యం కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కరి బాగోతాన్నీ బయటపెడతానంటూ ట్వీట్ చేశారు. గతంలో సంగతి ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం వజియసాయి రెడ్డి విజల్ బ్లోయర్ గానే పని చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసారి నోరు విప్పితే.. జగన్ హయాంలో జరిగిన అవకతవకలన్నీ ససాక్ష్యాలతో బయటకు రావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.