posted on Apr 22, 2025 2:01PM
ఏపీ మద్యం కుంభకోణం విచారణ తుది దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఈ కేసులో త్వరలోనే వైసీపీ పెద్దలందరికీ నోటీసులు అందబోతున్నాయా? అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే జవాబే వస్తున్నది. వైసీపీ మాజీ ఎంపీ, విజయసాయి రెడ్డి ఈ కుంభకోణంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాను మొదటే చెప్పాననీ అంటున్నారు. అంతే కాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ తాను బయటకు లాగుతాననీ చెబుతున్నారు. తాను ఈ కేసుకు సంంబంధించినంత వరకూ విజిల్ బ్లోయర్ ను అని చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డి అసలీ కుంభకోణానికి బీజం పడింది మాత్రం తన నివాసంలోనే అని అంగీకరిస్తున్నారు. ఈ కుంభకోణం గురించి తనకు తెలిసిన ప్రతీ విషయాన్నీ పోలీసులకు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు అందజేస్తానని చెబుతున్నారు. ఎంత కాదనుకున్నా విజయసాయి రెడ్డి మాటలు వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ పార్టీలో నంబర్ 2గా.. ఒకానొక దశలో డిఫాక్టో సీఎంగా కూడా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాల గురించి క్షుణ్ణంగా తెలుసునని పరిశీలకులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీలో, వైసీపీ ప్రభుత్వంలో విజయసాయికి తెలియని విషయమంటూ ఉండే అవకాశం లేదు. కనుక మద్యం కుంభకోణంలో ఆయన బయటపెడతున్న, పెడతానంటున్న ప్రతి విషయమూ సంచలనాలను రేకెత్తిస్తుందనడంలో సందేహానికి తావు లేదు. గత రెండు మూడు రోజులుగా ఆయన ట్వీట్లు, మాటలూ చూస్తుంటే.. విజయసాయి అప్రూవర్ గా మారిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ కేసులో కర్త, ఖర్మ, క్రియగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మరో కేసులో అరెస్టయ్యారు. గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరూ అరెస్టు కావడం కాకతాళీయమని భావించలేము. అలాగే ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరావు సహా పలువురిని విచారించారు. సిట్ వేగం చూస్తుంటే..ఒకరి వెంట ఒకరుగా వైసీపీ పెద్దలందరినీ విచారణకు పిలవడానికి సిద్ధమైపోయినట్లే కనిపిస్తున్నది. ఇక ఈ కేసులో వైసీపీ పెద్దల విచారణకు విజయసాయిరెడ్డి వాంగ్మూలమే ఆధారమని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు, ఆరోపణలు ఎదుర్కొం టున్న వారూ అందరూ ఇప్పుడు సీన్ లోకి వచ్చేసినట్లే కనిపిస్తున్నది. రాజ్ కసిరెడ్డి అరెస్టుతో జగన్ వైసీపీ ముఖ్య నేతలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రధానంగా మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరెవరు విచారణను ఎదుర్కొనే అవకాశం ుందన్న అంశపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇంత జరిగినా, జరుగుతున్నా.. వైసీపీ మాత్రం తమ ప్రభుత్వ హయాంలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలూ అత్యంత పారదర్శకంగా జరిగాయని చెప్పుకుంటోంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడం, సిట్ అరెస్టులు, విచారణలు అంటూ హడావుడి చేయడం అంతా రాజకీయ వేధింపుల్లో భాగమేనని ఆరోపిస్తున్నది. అయితే ఈ ఆరోపణలన్నీ వైసీపీలోని భయాన్నే చూపుతున్నాయనీ, వైసీనీ నేతల ప్రకటనలు, వ్యాఖ్యలు అన్ని మేకపోతు గాంభీర్య ప్రదర్శన కిందకే వస్తాయనీ పరిశీలకులు అంటున్నారు. విజయసాయి వాంగ్మూలం ఎఫెక్ట్ వైసీపీమీద గట్గిగానే పడిందనడానికి తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమే తార్కానమంటున్నారు.