posted on Apr 22, 2025 3:58PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వేధించే విషయంలో తన పర బేధం లేదు. ఆయన హయంలో తెలుగుదేశం, జనసేన నేతలే కాదు, ఆయన సొంత పార్టీ అయిన వైసీపీ నేతలూ వేధింపులకు గురయ్యారు. అంతెందుకు సొంత చెల్లి, తల్లికి కూడా ఆయన నుంచి వేధింపులు తప్పలేదు. ఈ విషయాలన్నీ పదేళ్ల పాటు ఆ పార్టీలో పని చేసిన బయటకు వచ్చిన ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టిసుభాష్ చెప్పారు.
చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఉయ్యూరు మండలం గండిగుంటగ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వాసంశెట్టి సుభాష్ జగన్ కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం ఓ నలుగురితో చీకటి గదిలో కూర్చుని రాష్ట్రాన్ని పాలించిన జగన్.. పార్టీలో తనకు భజన చేసే వారూ, సాష్టాంగ దండప్రమాణాలు చేసే వారినే చేరదీసి పదవులిచ్చారని సుభాష్ చెప్పారు. పదేళ్ల పాటు తాను వైసీపీలో పని చేశాననీ, తనకు ఎమ్మెల్సీ ఇస్తామని కూడా ఆ పార్టీ నేతలు వాగ్దానం చేశారనీ చెప్పిన వాసంశెట్టి సుభాష్.. తానా పదవి వద్దన్నాననీ, తీసుకుని ఉంటే జనం తనను ఛీకొట్టి ఉండేవారనీ చెప్పారు. ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసిన మిథున్ రెడ్డి జగన్ కు సాస్ఠింగ దండప్రమాణం చేస్తూ పని సులువుగా అవుతుందని సూచించినట్లు చెప్పారు. కానీ అందుకు తాను నిరాకరించానన్నారు. అసలు వైసీపీ హయాంలో ఒక్క తెలుగుదేశం నేతలు మాత్రమే కాదు.. వైసీపీ నేతలు కూడా వేధింపులకు గురయ్యారని వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పట్ల జగన్ కోపానికి ఆయన జగన్ ఎదుట కాలు మీద కాలేసుకుని కూర్చోవడమూ, సర్ అంటూ సంభోదించకపోవడమే కారణమని వాసంశెట్టి అన్నారు. అంతెందుకు జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడిన సొంత చెల్లిని కూడా అధికారం దక్కిన తరువాత పక్కన పెట్టేశారని గుర్తు చేశారు. జగన్ లక్షల కోట్లు సంపాదించారనీ, అయినా ఆస్తుల కోసం తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లారనీ పేర్కొన్నారు.