ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రధాన సాధనం సినిమా. ఒకప్పుడు సినిమా తప్ప మరో ప్రత్యామ్నాయం ప్రజలకు లేదు. అందుకే సినిమా థియేటర్లు ఎప్పుడూ కిక్కిరిసి ఉండేవి. మారుతున్న కాలం, పెరుగుతున్న మాధ్యమాల వల్ల వినోదం అనేది విస్తృతం అయిపోయింది. ఓటీటీ, మొబైల్స్ వంటివి థియేటర్ల ప్రాధాన్యాన్ని తగ్గించేస్తున్నాయి. ఒకప్పుడు శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఇప్పుడది రివర్స్ అయింది. థియేటర్స్కి ప్రేక్షకులు ఎప్పుడు వస్తారా అని ఎగ్జిబిటర్స్ ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకీ థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతోంది అనేది వాస్తవం. ప్రస్తుతం దానికి ప్రధాన కారణంగా నిలుస్తున్న అంశం ఓటీటీ. ప్రతి సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు చుట్టం చూపుగా వెళుతున్నారు తప్ప ఖచ్చితంగా సినిమా చూడాలన్న కోరికతో కాదు.
థియేటర్లకు గడ్డు కాలం వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలిన థియేటర్లకు కూడా అదే గతి పట్టే అవకాశం ఉంది. అందుకే పివిఆర్ సంస్థ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు ఓ కొత్త ఆలోచన చేస్తోంది. మల్టీప్లెక్స్లలో మద్యం అమ్మకాలు సరఫరా చేయాలనేది ఆ ఆలోచన. మద్యం సేవించి థియేటర్లలోకి ప్రవేశించకూడదు అనే నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని సడలించాలని, షాపింగ్ మాల్స్లో మాదిరిగానే థియేటర్స్లో మద్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని పివిఆర్ భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాల్లో ఈ సంస్థ.. మద్యం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని ప్రభుత్వం ఆమోదిస్తే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో మద్యం అమ్మకాలు సాగించవచ్చని ఆ సంస్థ భావిస్తోంది.
విదేశాల్లోని లగ్జరీ థియేటర్స్లో ఈ సదుపాయం కల్పిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇక్కడ కూడా అది అమలు జరిగితే థియేటర్లకు ప్రేక్షకులు తరలి వస్తారని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. తద్వారా థియేటర్లకు ఆదాయం పెరుగుతుంది. దానితోపాటే ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సినిమాలు నిర్మించే నిర్మాతలకు కూడా ప్రోత్సాహంగా ఉంటుందని పివిఆర్ భావిస్తోంది. మరి ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.