మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ని అల్లు అర్జున్ (Allu Arjun) కలిశాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. అలాంటి సమయంలో కూడా కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బన్నీ బర్త్ డేకి మెగా ఫ్యామిలీ విష్ చేయలేదని కొందరు, మెగా ఫ్యామిలీ కష్టంలో ఉంటే బన్నీ కనీసం ట్వీట్ కూడా చేయలేదని మరికొందరు కామెంట్స్ చేశారు. అలాంటి వారికి కళ్ళు తెరిపించేలా, మేమంతా ఒకటే అని చాటి చెప్పేలా.. తాజాగా పవన్ ని బన్నీ కలిశాడని తెలుస్తోంది.
సింగపూర్ లో చికిత్స అనంతరం కుమారుడిని తీసుకొని హైదరాబాద్ వచ్చిన పవన్ ను సోమవారం సాయంత్రం అల్లు అర్జున్ కలిశాడట. స్వయంగా ఇంటికి వెళ్లి పవన్ ని కలిసిన బన్నీ.. మార్క్ శంకర్ యోగక్షేమాలు అడిగి, దాదాపు గంటసేపు అక్కడే ఉన్నాడట. ఈ విషయం గురించి మొదట మీడియాకి కూడా సమాచారం లేదు. మెగా, అల్లు సన్నిహిత వర్గాల ద్వారా కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది.
తాజాగా ఘటనతో.. ఎన్ని వచ్చినా, ఏం జరిగినా.. మెగా-అల్లు కుటుంబాల మధ్య అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో అనవసరమైన విమర్శలు చేస్తున్న కొందరు అభిమానులు ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.