posted on Apr 22, 2025 5:24PM
ఒకే ఒక్క మాటతో రాజకీయం తల్లకిందులు అయిపోయిన సందర్భాలు చరిత్రలో కాదు, నడుస్తున్న చరిత్రలోనూ చాలానే ఉన్నాయి. అయినా.. రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు నోరు జారుతూనే ఉంటారు. ఇందుకో తాజా ఉదాహరణ తెలంగాణ పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా రైతులే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరో వంక పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బతీసిందని బీఆర్ఎస్ నాయకులు ఒకరి వెంట ఒకరు కత్తులు దూస్తున్నారు.
అయితే.. నిజంగా అయన చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బ తీసిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు బీఆర్ఎస్ కు మాత్రం పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు చక్కగా అంది వచ్చాయని అంటున్నారు. ఒక విధంగా చూస్తే పీసీసీ అధ్యక్షుడు బీఆర్ఎస్ కు, స్నేహ హస్తం అందించారని అంటున్నారు.
ఈ నెల 27 న వరంగల్ లో జరప తలపెట్టిన టీఆర్ఎస్/బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి టీఆర్ఎస్/బీఆర్ఎస్ సభల సక్సెస్ కు ఇంధనంలా పనిచేసిన సెంటిమెంట్ ఏదీ లేని ప్రస్తుత పరిస్థితిలో సభ సక్సెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. పార్టీ మనుగడకు అత్యంత కీలకంగా భావిస్తున్న రజతోత్సవ సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా పార్టీ నాయకులకు ప్రతి రోజు పాఠాలు నూరిపోస్తున్నారు. కాసులు కుమ్మరించి అయినా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని నాయకులను కేసీఆర్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో వినవస్తోంది.
ఇలాంటి సమయంలో పీసీపీ చీఫ్ ఒక సెంటిమెంటల్ ఇష్యూ ని బంగారు పళ్ళెంలో పెట్టి బీఆర్ఎస్ కు అందించారని అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇతర కారణాలతో పాటుగా సెంటిమెంట్ ఇష్యూ లేక పోవడం కూడా ఒక కారణంగా బీఆర్ఎస్ నేతలు గుర్తించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడంతో పార్టీకి ఉన్న తెలంగాణ పేగుబంధం తెగిపోయిందని దాంతో కారు పార్టీని సెంటిమెంట్ రివర్స్ లో దెబ్బ తీసిందని గులాబీ పార్టీ గుర్తించిందని అంటారు.
అదెలా ఉన్నా ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణా ప్రభుత్వం సోమవారం ( ఏప్రిల్ 21)న నిజామాబాద్లో నిర్వహించిన ‘రైతు మహోత్సవ’ సభలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన రైతులే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ వ్యాఖ్యానించారని బీఆర్ఎస్ నాయకులూ మండి పడుతున్నారు.
నిజానికి మహేష్ కుమార్ గౌడ్, చెప్పింది సంపూర్ణ సత్యం కాదు, అలాగని సంపూర్ణ అసత్యమూ కాదు. అవును 1923లో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించినప్పుడు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వారంతా వ్యవసాయం చేయడమే కాకుండా మాక్కూడా వ్యవసాయం నేర్పించారు అంటూ చేసిన వ్యాఖ్య పూర్తి సత్యం కాకపోయినా పూర్తి అసత్యం కూడా కాదు.అక్కడి నుంచి ఇక్కడకు రైతులు వచ్చింది నిజం. కలిసి మెలసి వ్యవసాయం చేసింది నిజం. పరస్పరం అనుభవాలను పంచుకున్నది నిజం. పరస్పరం లాభదాయక వ్యవసాయ పద్దతులను నేర్చుకున్నది నిజం. ఇది చరిత్ర. కాదనలేని చరిత్ర. నిజానికి మహేష్ కుమార్ గౌడ్ తమ ఉపన్యాసంలో చెప్పింది కూడా అదే. అందులో పెద్దగా తప్పు పట్టవలసింది లేదు.
అయినా అయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆంధ్రా నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్కుమార్గౌడ్ అపరిపక్వత, అజ్ఞానంతో మాట్లాడిన మాటలు తెలంగాణకు తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు.ఆంధ్రా పాలకుల మెప్పుకోసమే ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని కేసీఆర్ పదే పదే చెప్పిన విషయం పీసీసీ చీఫ్ మాటలతో తేటతెల్లమైందని అన్నారు.
అలాగే.. మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కూడా మహేశ్కుమార్ గౌడ్ వైఖరి యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు ఉన్నదని అన్నారు. భావదారిద్య్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నామనే సోయి మరిచి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులని, వారికి బొత్తిగా తెలంగాణ సోయి లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. అయితే.. పీసీసే చీఫ్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్/బీఆరేస్ రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు ఎంతవరకు ఉపకరిస్తాయి. ఏ మేరకు సభ సక్సెస్ అవుతుంది అనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత దినదినాభి వృద్ధి కాదు, క్షణక్షణాభి వృద్ది చెందుతోంది. అందులో అనుమానం లేదు. కానీ.. కుటుంబ చట్రం నుంచి బయట పడక పోవడం ఇప్పటికీ బీఆర్ఎస్ కు శాపంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. సో. సభ సక్సెస్ అవుతుందా, చప్పగా ముగుస్తుందా? అంటే.. ప్రస్తుతానికి ‘నో కామెంట్’ అనేదే సరైన సమాధానం అవుతుందని అంటున్నారు.