posted on Apr 22, 2025 4:55PM
స్మిత సబర్వాల్ రాజకీయాల్లో చేరనున్నారా?
అయితే ఏ పార్టీ నుంచి..??
స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి. 2001లో ట్రైనీ ఐఏఎస్ గా కెరీర్ మొదలు పెట్టి.. బీఆర్ఎస్ హయాంలో సీఎంఓలో అపాయింట్ అయిన తొలి మహిళా ఉన్నతాధికారిణిగా ఆమెకున్న నేమ్ అండ్ ఫేమ్ నేషనల్ రేంజ్. ఒక సమయంలో ఆమె గురించి ఒక ఆంగ్ల పత్రికలో తప్పుడు కథనం ప్రసారమైందంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు.
రాజులు పోయారు- రాజ్యాలు పోయాయి అన్నట్టు ఆమెను అందలాన్ని ఎక్కించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలడంతో.. ఆమె స్వతహాగా తన ప్రభను కోల్పోతారని భావించారంతా. కానీ రేవంత్ సర్కార్ ఆమెకు సముచిత స్థానమే ఇచ్చింది. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమె ప్రజెంట్ కీ పొజిషన్లోనే ఉన్నారు. మే 7 నుంచి 31 వరకూ జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను దగ్గరుండి ఆమే చూసుకోవాలి.
కానీ ఇక్కడే ఆమె తప్పటడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు. ఒక ప్రభుత్వంలో ఉండి.. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం విమర్శించడం చేయకూడదు. ఇది ఆ అధికారిణికి తెలియంది కాదు. కానీ ఆమె అంతే అన్న విమర్శ కూడా ఉంది.
గతంలో స్మితా సబర్వాల్ దివ్యాంగులకు సంబంధించిన రాంగ్ కామెంట్స్ చేశారు. దీన్ని తెలుగు సమాజమంతా చీకొట్టింది. అయినా సరే స్మిత తన వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యవహారశైలి నుంచి బయట పడలేక పోతున్నారనే మాట వినిపిస్తోంది.
తాజాగా కంచె గచ్చిబౌలీ వ్యవహారంలో ఆమె సోషల్ మీడియా పై చేస్తున్న పోస్టింగులు పెను దుమారం చెలరేగేలా చేస్తున్నాయి. అవి ఏఐ, జిబిలీ వంటి ఆర్టిఫిషియల్ అయినా సరే, స్మిత వెనకాడ్డం లేదు. పోలీసులు నోటీసులు ఇస్తే.. అందుకు రిటన్ గా.. సుప్రీం కోర్టు ఆదేశాలను తిరిగి తన సోషల్ మీడియా అకౌంట్ పై పోస్ట్ చేసి ఔరా! అనిపిస్తున్నారు. అదేమంటే అది తన భావ ప్రకటనా స్వేచ్ఛ అంటున్నారు.
ఆనాడు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం.. సుమారు 20 లక్షల చెట్లు నరికేస్తే మారు మాట్లాడని స్మిత.. ఇప్పుడు కంచె గచ్చిబౌలీ విషయంలో వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారేంటి? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. నిజానికి స్మిత బేసిక్ పర్సనాల్టీ ఎలాంటిదని చూస్తే ఆమె నిజం ఎటు వైపు ఉంటే అటు వైపు ఉంటారనడానికి వీల్లేకుండా పోతోంది. అప్పుడు అంత పెద్ద ఎత్తున విధ్వంసాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్న స్మిత ఇప్పుడు మాత్రం ప్రభుత్వ విధానాలనే తప్పు పడుతున్నారు. అప్పుడు కూడా ఆమె ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక కామెంట్లు చేశారా? అంటే లేదన్న సమాధానమే వస్తోంది.
ఆమె ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే, అది ఎలాగూ.. ప్రతిపక్షాన్ని సపోర్ట్ చేయడమే అవుతుంది. కాబట్టి ఇది స్మిత రాజకీయపు ఎత్తుగడా? అన్న అనుమానాలు చాలా మందిలో వ్యక్తమౌతున్నాయి. ఆమె ఐఏఎస్ అధికారిణిగా ఎక్కువ కాలం ఉండక పోవచ్చనీ త్వరలోనే ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ లా ఏదైనా రాజకీయపు అడుగులు వేసే ఛాన్స్ ఉందనీ అంటున్నారు.
ఐఏఎస్ లు ఇలా రాజకీయంగా ఎదగడం అన్నది ఈ నాటిది కాదు. ప్రస్తుతం కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణవ్ సైతం ఒక ఐఏఎస్ అధికారే. ఈ క్రమంలో చూస్తే స్మిత.. గత కొంతకాలంగా చేస్తున్న మౌన శబ్ధాలు.. ఆమె రాజకీయపు ఆలోచనలకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. మరి స్మిత వచ్చే రోజుల్లో పొలిటీషియన్ కావడానికి అవకాశముందా? లేదా తేలాల్సి ఉంది.