posted on May 13, 2025 3:17PM
భారత వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై భారత్ కస్టమ్స్ పన్ను విధించాలని నిర్ణయించింది. విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు తెలియజేసింది. యూఎస్ దిగుమతులపై ఇచ్చిన రాయితీలను వెనక్కి తీసుకోవడమే కాకుండా కొన్ని వస్తువులపై టారిఫ్లు పెంచున్నట్లు డబ్ల్యూటీఓకి భారత్ తెలియజేసింది. భారత వస్తువులు స్టీల్, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన యూఎస్ వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. అమెరికా ఇటీవల విధించిన టారిఫ్ల కారణంగా 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అందుకే అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తోందని భారత్ తప్పుపట్టింది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్లు విధించారు. క్రూడ్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది.
ఇప్పుడు దీనిపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడనుంది. ఇప్పుడు అమెరికా వస్తువులపై ప్రతీకార టారిఫ్లు విధిస్తామని ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్ తెలియజేయడం ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతోందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ-వాషింగ్టన్ అత్యంత సమీపానికి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాకు వాణిజ్యలోటును తగ్గించడం కోసం ఈ డీల్ ద్వారా భారత్ చాలా రాయితీలను ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించారు. ఇక అమెరికా-చైనా మధ్య జరిగిన సుంకాలు, ప్రతీకార సుంకాలు తారస్థాయికి చేరుకోవడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.