అరకు ఫ్యాన్ పార్టీలో వర్గ పోరు? | three fractions in araku ycp| internal| fight| cadre| keep| distance

posted on May 22, 2025 10:44AM



క్యాడర్ కకావికలు!

సిట్టింగ్ స్థానంలోనూ ఉనికి గాయబ్?

చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా గత ఎన్నికలలో   ఫ్యాన్ పార్టీ ఘోరంగా ఓడిపోయినా..  అరకు పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఆ విజయం సాధించిన స్థానాలలో సైతం ఫ్యాన్ పార్టీ వర్గపోరుతో ప్రతిష్ఠను దిగజార్చుకుని పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మన్యం ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నది  ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.  

ఈ పరిస్థితుల్లో గిరిజన ప్రాంతమైన పాడేరు, అరకు నియోజకవర్గాలలో ఫ్యాన్ పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి అంతర్గత కుమ్ములాటలతో తమ పరువు తీసుకోవడమే కాకుండా కార్యకర్తలనూ పార్టీకి దూరం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు… అరకు ఎమ్మెల్యే మత్స్య లింగం లకు వారి పార్టీ అధికారంలో లేకపోవడంతో  సహజంగానే  పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది.  ఈ దశలో ఫ్యాన్ పార్టీ నాయకులు ఉమ్మడిగా పని చేయాలి. అయితే  వర్గపోరుతో వారి ప్రాధాన్యతను వారే మరింతగా తగ్గించుకుని పరువుపోగొట్టుకుంటున్నారు.  

వైసీపీకి మొదటి నుంచి అరకు ఏజెన్సీలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు వర్గం, మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ వర్గం మధ్య ఆధిపత్య పోరు ఉంది. దానికి తోడు  ఇప్పుడు ఎమ్మెల్యే మత్స్యలింగం వర్గం తయా రయింది ఈ దశలో ఏ నాయకుని వెంట వెళ్తే మరొకరి నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అని కార్యకర్తలు భయపడుతున్నారు. ఇప్పటికే జడ్పిటిసిలు ఆటో కాలు ఇటో కాలు అన్నట్టు వ్యవహ రిస్తున్నారు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ పై గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న నిరసనలను అవకాశంగా మలచుకోవలసిన వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారేగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కుంభారవిబాబు మరోవైపు చెట్టి ఫల్గుణ ఇంకోవైపు మత్స్య లింగం వర్గాలు  మన్యంలో వైసీపీ పార్టీని మూడుముక్కులుగా చేసి ఆడుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ మూడు వర్గాల మధ్యా ఆధిపత్య పోరులో పార్టీ క్యాడర్ నలిగిపోతున్నదనీ, దీంతో క్యాడర్ పార్టీ కార్యక్రమాలంటేనే ముఖం చాటేస్తోందనీ చెబుతున్నారు.  అధికారంలోలేని పార్టీ నాయకులు వర్గపోరుతో పార్టీని మరింత నిర్వీర్యం చేస్తుంటే.. అధికార తెలుగుదేశం కూటమి నేతలు మాత్రం ప్రజలకు చేరువై, వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారి ఆదరణ చూరగొంటున్నారు.దీంతో అరకు లోయలో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారైందంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అరకు లోయలో  వైసీపీ జెండా మోయడానికి  కార్యకర్తలే కరవయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెబు తున్నారు. 



Source link