posted on May 13, 2025 2:52PM
భారత్ ఆయుధాలు పరీక్షకు నిలబడ్డాయా?
భారత్ ఆయుధాలు కూడా మార్కెట్లోకి ప్రవేశించినట్టేగా?
ఆపరేషన్ సిందూర్ ద్వారా మరో ఆయుధ లాభమేంటి?
ఇన్నాళ్ల పాటు మన ఆయుధాలు.. ఎక్కడో గోదాముల్లో మాత్రమే ఉండేవి. అప్పుడప్పుడూ వాటి పరీక్షల సమయంలో మాత్రం సినిమాలలో ఐటెం సాంగ్ లా మన ఆయుధాలు కూడా ఐటెం కింద వార్తల్లో నిలిచేవి. ఎంత పెద్ద బ్రహ్మోస్ క్షిపణి వార్త గురించైనా సరే స్పీడ్ న్యూస్ లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవి. ఇప్పుడలా కాదు.. మన బ్రహ్మోస్ ఒక ఇంటర్నేషనల్ హెడ్ లైన్. మన ఆకాష్ ఒక పవర్ ఫుల్ కవర్ ప్యాకేజ్. ఇక మన స్కై స్ట్రైకర్, నాగాస్త్ర- 1 వంటటివి నాన్ స్టాప్ న్యూస్ కవరేజ్. వీటికి రష్యన్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్స్ కి ఫుల్ ఫాలోయింగ్. రాఫెల్ కి కూడా కావాల్సినంత ఇమేజ్..
సరే రష్యన్ ఎస్ 400 హండ్రెడ్స్, ఫ్రెంచ్ రాఫెల్స్ అంటే అది మన స్వదేశీ పరిజ్ఞానం కాదు. అదే బ్రహ్మోస్ అలాక్కాదే. అది పాకిస్థాన్ గుండెల్లో మోగించిన అణుబాంబులు అంత మామూలు విషయం కాదు. భారత అమ్ముల పొదిలో దాగిన బ్రహ్మాస్త్రం. స్వయానా మనం తయారు చేసిన అద్భుతమైన ఆయుధం. ఇదెంత వరకూ పేలిందో పేల్లేదో తెలియాలంటే ఈ విషయం గురించి మనం భారతీయులను కాదు అడగాల్సింది పాకిస్తానీ నేషనల్ కమాండ్ మీటింగ్ కి హాజరైన వారిని అడగాలి. ఎందుకంటే వారేగా ఇది నూర్ ఖాన్ వైమానిక స్థావరం దగ్గర పడ్డంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే ఇక్కడికి దగ్గర్లోనే కర్ణీ కొండలుంటాయి. వాటి పక్కనే 170 పాక్ మేడ్ అణ్వాయుధాల నిల్వలుంటాయి.
మన బ్రహ్మోస్ వారి అణు నిల్వల పక్కన పడ్డందుకే పాకిస్థాన్ అంతగా ఉలిక్కి పడి వెంటనే యూఎస్ కి సంకేతాలిచ్చిందని చెబుతారు. ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా సలహా దారు మార్క్ ఆంటోనీ రూబెన్స్, ఇక మన ఇంటి అల్లుడు జేడీ వాన్స్ రంగంలోకి దిగడం ఆ నలభై ఎనిమిది గంటల పాటు భారత్ పాక్ మిలటరీ ఇతర విదేశాంగ అధికారులతో మాట్లాడ్డం చకచక జరిగాయ్. ఆల్ క్రెడిట్స్ గోస్ టూ బ్రహ్మోస్. మన బ్రహ్సోస్ ఆపిన యుద్ధమిది.
అప్పటి వరకూ ఇంటర్నేషనల్ మీడియాను విశేషంగా ఆకట్టుకుంటోంది చైనా మార్క్ పీఎల్ 15. ఇది శాటిలైట్ కమ్ ఏఐ ఆపరేటెడ్ సైలెన్స్ వెపన్ అనీ.. దీన్నుంచి మన రాఫెల్స్ ఎంత మాత్రం తప్పించుకోలేవని ఓ ఊదరగొట్టేవారు. దీంతో చైనా పీఎల్ 15 కి విశేష మైన ఆధరణ లభిస్తోన్న వేళ.. మన వాళ్లు తెలివిగా మే 10 వ తేదీన మన బ్రహ్మోస్ ని కర్ణీ కొండలకు దగ్గరగా ప్రయోగించడంతో.. గేమ్ ఛేంజర్ గా నిలిచింది. అందుకే ఈ బ్రహ్మోస్ కి ఆపరేషన్ సిందూర్ లో కాల్పుల విరమణను ఆపిన గొప్ప పేరొచ్చింది. బ్రహ్మోస్ ఎంత హిట్ అంటే ఆర్మేనియా 6 వేల కోట్లకు మనకు ఆర్డరిచ్చింది. ఇండోనేసియా వంటి దేశాలు సైతం ఇంట్రస్ట్ చూపిస్తున్నాయ్.
ఇక మన ఆకాశ్ అయితే ఈ సరికే.. 23 వేల కోట్ల విలువైన ఆర్డర్ పట్టేసింది. ఇది గతంతో పోలిస్లే 12 శాతంకన్నా ఎక్కువ. దీని ఫ్యాన్ ఫాలోయింగ్ అంత మామూలుగా లేదు. పాక్ వాడిన టర్కిష్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడంలో మన ఆకాశ్ పనితీరుకు విశేషమైన ప్రశంసలు లభించాయి. 1980లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రూపుదిద్దుకుంటూ వచ్చినది ఆకాశ్. ఇది శతృ విమానాలు, డ్రోన్లు, చాపర్లను ఇట్టే ఢీ కొట్టగలదు. దీన్ని మన డీఆర్డీవో, బీఈఎల్, బీడీఎల్ సంయుక్త నిర్వహణలో తయారు చేశారు.
వీటితో పాటు.. మన యాంటీ డ్రోన్ ఫోర్ డీ సిస్టమ్ కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆత్మనిర్భర్ భారత్ కింద భారత్ తయారీ చేసిన స్వదేశీ పరిజ్ఞానపు మచ్చు తునకల్లో ఇది కూడా ఒకటి. పాక్ వాడిన టర్కిష్ డ్రోన్లను గట్టిగా దెబ్బ తీసిన ఆయుధాల్లో ఇదే అత్యంత వేగంగా ఖచ్చితంగా పని చేసింది. ఇది డీఆర్డీవో ద్వారా డెవలప్ చేయబడి బీడీఎల్ తయారీ. దీని కెపాసిటీ మొత్తం ఈ ఆపరేషన్ సిందూర్ లో వెలుగులోకి వచ్చింది.
ఇక నాగాస్త్ర 1 సంగతి సరే సరి. ఇది ఎలాంటిదంటే ఆత్మాహుతి డ్రోన్ సంతతకి చెందినది. టార్గెట్ దొరికే వరకూ ఆ ప్రాంతంలో అలాగే నిలిచి.. తర్వాత.. దూసుకుపోగలదు. ఇది ఏకకాలంలో టార్గెట్ ఛేజింగ్ దాని ధ్వంసం రెండూ చేయల నాగాస్త్రం. ఇలా దీని ప్రత్యేకతలు చాలానే. ఈ ఆపరేషన్ సిందూర్ లో ఇలాంటి ఆయుధాలు ఉంటాయని కూడా తెలియని వారికి వీటి విలువ ఏమిటో తెలియ వచ్చింది. స్కై స్ట్రైకర్స్. ఇది మన బెంగళూరులో తయారైనది. ఇందులో ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడాం. ఇది భారత్ ఇజ్రాయెలీ జాయింట్ వెంచర్. అలాంటి ఇది కూడా ఆపరేషన్ సిందూర్ లో తన పని తనం చూపించి భారత్ ఆయుధ మార్కెట్ విలువ అమాతం పెంచేసింది.
ఇప్పుడు పలు దేశాలు భారత్ కి సంబంధించిన ఆయుధాలను మేం కొంటామంటే మేం కొంటామంటూ ఎగబడుతున్నారు. కారణం ఏంటంటే ఒక రష్యా, యూఎస్, ఫ్రెంచ్ వంటి దేశాల నుంచి ఆయుధాల కొనుగోలు అంటే అదేమంత మాములు విషయం కాదు. అదే భారత్ ఇటు సినిమాలు, అటు శాటిలైట్లతో పాటు.. ఆయుధాల తయారీలోనూ స్వదేశీ పరిజ్ఞానం వాడి.. అత్యంత తక్కువ ధరలకే అమ్మే కెపాసిటీ సొంతం చేసుకుంది.. దీంతో మన ఆయుధ మార్కెట్ అ..ధరహో! అంటోంది..